కేప్టౌన్ వేదికగా జరిగిన భారత్-దక్షిణాఫ్రికా టెస్టు చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత తక్కువ బంతుల్లో ఫలితం వచ్చిన మ్యాచ్గా రికార్డులకెక్కెంది. కేవలం ఒకటిన్నర రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్ ఫలితం 106.2 ఓవర్లలోనే తేలింది. టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేసింది.కేప్టౌన్లో భారత్కు ఇదే తొలి విజయం కావడం విశేషం.
అయితే జూన్లో జరగనున్న ప్రపంచకప్ షెడ్యూల్ ఖరారైంది. ఈ మెగాటోర్నీ కోసం 20 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్-Aలో భారత్, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికా ఉన్నాయి. గ్రూప్-Bలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నమిబియా, స్కాట్లాండ్, ఓమన్ జట్లు పోటీపడుతున్నాయి. గ్రూప్-Cలో న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, ఉగాండ, పపువా న్యూ గినియా జట్లు ఉన్నాయి. అలాగే గ్రూప్-Dలో దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ జట్లు తలపడనున్నాయి.

అయితే అన్ని గ్రూప్లలో కంటే గ్రూప్-D పోటీ ఎక్కువగా ఉంది. పొట్టి ఫార్మాట్లో శ్రీలంక, బంగ్లాదేశ్ గట్టి పోటీదారులే. అంతేగాక మెగాటోర్నీలో దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ ఇటీవల రెండు సార్లు ఓడించింది. వన్డే ప్రపంచకప్లో సౌతాఫ్రికాను ఓడించిన నెదర్లాండ్స్ గత టీ20 వరల్డ్ కప్లోనూ బిగ్ షాక్ ఇచ్చింది. డచ్ జట్టు చేతిలో ఓడటంతో సౌతాఫ్రికా సెమీఫైనల్స్కు వెళ్లలేకపోయింది. హేమాహేమీలను ఓడించే దక్షిణాఫ్రికా ఆ జట్టుపై విఫలమవ్వడం అందరికీ ఆశ్చర్యమే.
టీ20 ప్రపంచకప్లో భాగంగా నెదర్లాండ్స్తో మరోసారి సఫారీ సేన గ్రూప్-Dలో పోటీపడనుండటంతో ఆసక్తికరంగా మారింది. అన్ని గ్రూప్ల కంటే గ్రూప్-డీ మ్యాచ్లు హొరాహోరీగా సాగడం ఖాయమని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో 'గ్రూప్-డీ' నెట్టింట్లో ట్రెండింగ్లోకి వచ్చేసింది. అయితే గ్రూప్ల జాబితాను ఐసీసీ అధికారికంగా ప్రకటించనప్పటికీ దాదాపు ఖరారైందని సమాచారం.
కాగా, భారత్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల తేదీలు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. జూన్ 5వ తేదీన ఐర్లాండ్, జూన్ 9న పాకిస్థాన్, జూన్ 12న అమెరికా, జూన్ 15న కెనడా దేశాలతో టీమిండియా తలపడనుంది. న్యూయర్క్లోని ఐసెన్హోవర్ పార్క్ వేదికగా భారత్-పాకిస్థాన్ తలపడే అవకాశాలు ఉన్నాయి. ఈ వేదికను ప్రపంచకప్ కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ స్టేడియం కెపాసిటీ సుమారు 34,000. గ్రూప్ స్టేజ్ మ్యాచ్లన్నింటినీ టీమిండియా అమెరికాలోనే ఆడునుంది.
వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా టీ20 ప్రపంచకప్నకు ఆతిథ్యం ఇస్తుంది. ఈ మెగాటోర్నీలో గ్రూప్ల్లో నిలిచిన టాప్-2 జట్లు సూపర్-8కి అర్హత సాధిస్తాయి. ఈ సూపర్-8 జట్లను కూడా రెండు గ్రూప్లుగా విభజిస్తారు. వాటిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. సెమీస్లో గెలిచిన జట్లు ఫైనల్కు వెళ్తాయి.