
హైదరాబాద్: ఫార్మాట్ ఏదైనా క్రికెట్ ఆటలో రెగ్యులర్ బౌలర్లు, ఆల్రౌండర్లు, పార్ట్టైమ్ బౌలర్లు ఉండడం సహజం. టీమిండియాలో సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్ లాంటి వారు పార్ట్టైమ్ బౌలర్లుగా రాణించారు. కొన్నిసార్లు తమ అద్భుత బౌలింగ్ మాయాజాలంతో మ్యాచ్లు గెలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సచిన్ తన లెగ్ స్పిన్తో టాప్ బ్యాట్స్మన్ను సైతం బోల్తా కొట్టించాడు. వీరూ కూడా బంతిని ఇచ్చిన ప్రతిసారి కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు.
అయితే ఏబీ డివిలియర్స్, మహేళ జయవర్దనే, స్టీఫెన్ ప్లెమింగ్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, సయీద్ అన్వర్, మహ్మద్ యూసఫ్ ఇలా ఎవరిని చూసుకున్నా.. వీరంతా ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్లుగానే మనందరికీ తెలుసు. వీరందరూ మైదానంలో పరుగుల వరద పారించిన వారే. బ్యాట్స్మెన్లుగా ఒకప్పుడు సత్తా చాటినవారు కొందరు ఉంటే.. మరికొందరు ఇప్పుడు కూడా రాణిస్తూనే ఉన్నారు. కోహ్లీ తప్ప అందరూ రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే కెరీర్ మొత్తం బ్యాటింగ్కే పరిమితమైన ఈ ఆటగాళ్లు అరుదుగా బౌలింగ్ చేశారు.
బ్యాట్స్మెన్లుగా తమ పేరిట ఎన్నో రికార్డులు సృష్టించిన ఏబీ, మహేళ, స్టీఫెన్, అన్వర్, యూసఫ్, ధోనీలు అప్పుడప్పుడు బౌలర్ అవతారమెత్తి వికెట్లు కూడా తీశారు. కొందరు మాత్రం మరో అడుగు ముందుకేసి మ్యాచ్లు గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. తాజాగా ఐసీసీ పాతతరం.. కొత్తతరం క్రికెటర్లు తమ జట్లకు బౌలింగ్ చేసిన ఒక మొమరబుల్ వీడియోనూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.
ఈ వీడియోలో మనకు ఎప్పుడు బౌలింగ్ చేసినట్లు కనిపించని మహేళ జయవర్దనే.. ఏబీ డివిలియర్స్.. ఎంఎస్ ధోనీ.. స్టీఫెన్ ప్లెమింగ్ లాంటివారు బౌలింగ్ చేయడమే గాక వికెట్లు తీయడం ఐసీసీ చూపించింది. 'మీకు సమయం ఉంటే మాత్రం ఈ వీడియోను అస్సలు మిస్సవ్వద్దు' అంటూ క్యాప్షన్ జత చేసింది. అయితే ఐసీసీ షేర్ చేసిన వీడియో కాస్త కొత్తగా ఉండడంతో వైరల్గా మారింది. క్రికెట్ అభిమానులు వీడియోను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.