T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ ముందు పాకిస్థాన్ ప్రభుత్వం, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న మొండి నిర్ణయం ఇప్పుడు ఆ దేశ క్రికెట్ భవిష్యత్తునే ప్రమాదంలో పడేసేలా కనిపిస్తోంది. బంగ్లాదేశ్కు మద్దతుగా భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలని పాక్ నిర్ణయించుకోవడంపై ఐసీసీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ప్రపంచకప్లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం పాక్ క్రికెట్ను చావుదెబ్బ తీసేలా ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం పాకిస్థాన్ కొన్ని శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
భారీ ఫైన్.. నిధుల నిలిపివేత
భారత్-పాక్ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ వ్యూయర్షిప్ ఉంటుంది. ఈ మ్యాచ్ రద్దయితే బ్రాడ్కాస్టర్ (జియో-స్టార్)కు కలిగే భారీ నష్టాన్ని పీసీబీనే భరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఐసీసీ నుంచి పాకిస్థాన్కు అందాల్సిన వార్షిక ఆదాయ వాటాను కూడా పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది.

ద్వైపాక్షిక సిరీస్లపై నిషేధం
ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను, ఇతర సభ్య దేశాలు పాకిస్థాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడకుండా ఐసీసీ ఆంక్షలు విధించవచ్చు. దీనివల్ల పాక్ జట్టు అంతర్జాతీయ క్రికెట్కు దూరమయ్యే ప్రమాదం ఉంది.
పాకిస్థాన్ సూపర్ లీగ్కు విదేశీ ఆటగాళ్ల దూరం
పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆడే విదేశీ ఆటగాళ్లకు వారి దేశాల క్రికెట్ బోర్డుల నుంచి ఎన్ఓసీ (NOC)లు రాకుండా ఐసీసీ ఒత్తిడి తీసుకురావచ్చు. కేవలం రిటైర్ అయిన ప్లేయర్లు తప్ప.. ప్రస్తుత అంతర్జాతీయ స్టార్లెవరూ పీఎస్ఎల్లో ఆడకుండా నిషేధం విధించే అవకాశం ఉంది.
ఆసియా కప్ నుంచి బహిష్కరణ
ఐసీసీ టోర్నీల్లో రాజకీయ జోక్యం చేసుకున్నందుకు గాను, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ద్వారా నిర్వహించే ఆసియా కప్ నుంచి కూడా పాకిస్థాన్ను తప్పించే అవకాశం ఉంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల కోత
పాకిస్థాన్ గనుక తన పద్ధతి మార్చుకోకపోతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఆ జట్టు పాయింట్లను రద్దు చేయడం లేదా జట్టును టోర్నీ నుంచి తొలగించే కఠిన నిర్ణయాలను ఐసీసీ పరిశీలిస్తోంది. పాక్ ప్రభుత్వ నిర్ణయంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ను రాజకీయాలతో ముడిపెట్టి దేశ ప్రతిష్టను, ఆటగాళ్ల భవిష్యత్తును నాశనం చేయవద్దని వారు పీసీబీని హెచ్చరిస్తున్నారు.
భారత్ పరిస్థితి ఏంటి?
పాకిస్థాన్ మ్యాచ్కు రాకపోతే భారత జట్టుకు ఎటువంటి నష్టం ఉండదు. ఐసీసీ ప్రోటోకాల్ ప్రకారం భారత్కు వాకోవర్ లభిస్తుంది. నేరుగా 2 పాయింట్లు పట్టికలో చేరతాయి. భారత జట్టు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబో చేరుకుని మైదానంలో సిద్ధంగా ఉంటుంది.
అభిమానులను నిరాశపర్చిన పాక్ నిర్ణయం
భారత్తో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ను బాయ్కాట్ చేయాలన్న పాకిస్థాన్ నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్ను నిరాశపరిచింది. కానీ ఈ నిర్ణయం వల్ల అసలు నష్టం ఎదుర్కోబోయేది పాకిస్థానేనని విశ్లేషణలు చెబుతున్నాయి. ఇప్పటికే ద్వైపాక్షిక సిరీస్లు లేక భారీ ఆదాయం కోల్పోయిన పాక్ క్రికెట్ బోర్డు.. ఇప్పుడు ఐసీసీ టోర్నీలో భారత్ మ్యాచ్ తప్పుకోవడం వల్ల మరింత ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. మ్యాచ్ జరగకపోతే ఐసీసీకి వేల కోట్ల నష్టం, పాక్కు వచ్చే ఆదాయ వాటాపై కోత, భవిష్యత్తులో మరిన్ని ఆంక్షలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.