సెప్టెంబర్ 28 నుంచే అమల్లోకి కొత్త నిబంధన
సెప్టెంబర్ 28 నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ నిబంధన వచ్చి 24 గంటలు గడవకముందే ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ చెందిన ఆటగాడు మార్నస్ ల్యాబుస్చాగ్నె ఈ నిబంధనను అతిక్రమించాడు. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ కొట్టిన బంతిని పట్టుకోకుండానే దానిని విసిరినట్లు నటించాడు. దీంతో అతని జట్టుకి ఐదు పరుగులు జరిమానా విధించారు. అంటే.. బ్యాట్స్మెన్కి జట్టు స్కోరుకి ఐదు పరుగులు బోనస్గా కలపడం అన్నమాట. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
కొత్త నిబంధనను ప్రవేశపెట్టిన ఐసీసీ
క్రికెట్లో ప్రత్యర్థి ఆటగాళ్లను ఏమార్చడం తరుచూ చూస్తూనే ఉంటాం. దీనిని అరికట్టేందుకు ఐసీసీ ఈ నిబంధన ప్రవేశపెట్టింది. అయితే దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం ఫీల్డ్ అంపైర్లు కట్టబెట్టారు. కొత్తగా ఐసీసీ ప్రవేశపెట్టిన ఈ ఫేక్ ఫీల్డింగ్ జరిమానా రూల్పై మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ పెదవి విరిచాడు. వరుస ట్వీట్లతో ఐసీసీపై మండిపడ్డారు.
ఈ విధానం చాలా హాస్యాస్పదంగా ఉంది
'ఫేక్ ఫీల్డింగ్ చేస్తే ప్రత్యర్థి జట్టుకు 5 పరుగుల ఇచ్చే విధానం చాలా హాస్యాస్పదంగా ఉంది. అలా అవుట్ చేయడం ఛీటింగ్ కాదు.. అది ఆటగాడి చతురత. ఉదాహరణకి మహేంద్రసింగ్ ధోని చేసే రనౌట్నే తీసుకుంటే.. అతను బంతిని చేతుల్లోకి తీసుకునే విధానం, వికెట్లపైకి విసిరే టాలెంట్ని మనం ప్రశంసించాలి. అంతేకాని జరిమానా విధించకూడదు. దీనిపై ఐసీసీ పునరాలోచించుకోవాలి. ఒకవేళ బ్యాట్స్మెన్ బౌలర్, ఫీల్డర్లను మోసపుచ్చినట్లు వ్యవహరిస్తే ఏం చేస్తారు' అని మంజ్రేకర్ ప్రశ్నించాడు.
|
నెటిజన్ చేసిన విజ్ఞప్తిపై
ఆటగాళ్ల ఫేక్ ఫీల్డింగ్ను అరికట్టేందుకు ఓ విధానాన్ని సూచించాలంటూ ఓ నెటిజన్ చేసిన విజ్ఞప్తిపై మంజ్రేకర్ స్పందించాడు. ఫేక్ ఫీల్డింగ్ మోసం కాదని.. అందుకు మహేంద్రసింగ్ ధోనీయే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఫేక్ ఫీల్డింగ్ను నేరంగా పరిగణించడంపై పునరాలోచించాలని ఐసీసీని కోరినట్లు మంజ్రేకర్ ఈ సందర్భంగా తెలిపాడు.