గతేడాది నిర్వహించిన వన్డే వరల్డ్ కప్తో భారత్లో కనక వర్షం కురిసిందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తెలిపింది. 2023 అక్టోబర్-నవంబర్లో జరిగిన వన్డే ప్రపంచకప్కు భారత్ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ భారత్లో రూ.11,637 కోట్ల ఆర్థిక ప్రయోజనాన్ని కలిగించిందని, విదేశీ పర్యాటకులతో పర్యాటక రంగం పెద్దఎత్తున లాభపడిందని ఐసీసీ పేర్కొంది.
ఈ విషయాన్ని ఐసీసీ సీఈఓ జెఫ్ అలార్డైస్ ఓ ప్రకటనలో తెలిపారు. ''క్రికెట్కు ఉన్న ఆర్థిక శక్తి ఎలాంటిదో వన్డే వరల్డ్ కప్ నిరూపించింది. ఆతిథ్య భారత్కు రూ.11,637 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూర్చింది. ఈ మెగాటోర్నీని వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా భారత్కు క్రికెట్ అభిమానులు పోటెత్తారు. మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చిన నగరాల్లో టూరిజం ద్వారా రూ. 7వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ముఖ్యంగా ట్రావెల్, ట్రాన్స్పోర్టెషన్, ఫుడ్, విదేశీ పర్యాటకులతో భారీ ఎత్తున డబ్బులు వచ్చాయి' అని ఐసీసీ పేర్కొంది.

రికార్డు స్థాయిలో 12.5 లక్షల మంది మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించారని ఐసీసీ తెలిపింది. ఇందులో 75 శాతం మంది తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్కు హాజరయ్యారని పేర్కొంది. ఈ క్రమంలో దాదాపు 48వేల మంది ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఉద్యోగాలతో ఉపాది పొందారని ఐసీసీ వెల్లడించింది. కాగా, టోర్నీ ఆద్యంతం వరుస విజయాలతో హోరెత్తించిన భారత్ ఫైనల్లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. టైటిల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై కప్ను చేజార్చుకుంది.
ఇక ఈ మెగాటోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో టాప్-2లో మన బ్యాటర్లే ఉన్నారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఉన్నారు. కోహ్లి 95.62 సగటుతో 765 పరుగులు చేశారు. రోహిత్ 54.27 సగటుతో 597 పరుగులు చేశాడు. ఇక వికెట్ల వేటలోనూ మనోళ్లే టాప్. మహ్మద్ షమి అగ్రస్థానంలో ఉన్నాడు. ఏడు మ్యాచ్ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా 11 మ్యాచ్ల్లో 20 వికెట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.