దుబాయ్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీకి రంగం సిద్ధమైంది.ఈ నెల 17 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 17న క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 23న సూపర్ 12 స్టేజ్ ఆరంభం అవనుంది. ప్రపంచకప్లోని గ్రూప్ 1లో భాగంగా అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్లో తొలి మ్యాచ్ జరగనుంది. టీ20 కప్ కోసం ఇప్పటికే చాలా జట్ల ఆటగాళ్లు యూఏఈ చేరుకున్నారు. ఐపీఎల్ 2021 రూపంలో చాలా మంది ఆటగాళ్లకు అక్కడ మంచి ప్రాక్టీస్ కూడా లభిస్తోంది. ఐపీఎల్ 2021 ఈనెల 15న ముగియనుండగా.. 17న టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.
David Warner: 'కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించారో కారణం చెప్పలేదు.. అసలు జీర్ణించుకోలేకపోతున్నా'
టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీలోని ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రధాన జట్లన్నీ వార్మప్ మ్యాచ్లు ఆడనున్నాయి. ఇందుకు సంబందించిన షెడ్యూల్ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. క్వాలిఫైర్ మ్యాచులలో తలపడే జట్లు ఇప్పటీకే వార్మప్ మ్యాచ్లు ఆడుతున్నాయి. అక్టోబర్ 12 నుంచి 14 వరకు క్వాలిఫైర్ జట్లు వార్మప్ మ్యాచ్లు ఆడనున్నాయి. ఇక సూపర్ 12 స్టేజిలో ఉన్న జట్లకు వార్మప్ మ్యాచ్లు అక్టోబర్ 18న ఆరంభం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం విరాట్ కోహ్లీ సారధ్యంలోని టీమిండియా రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. 18వన ఇంగ్లండ్తో (7:30 pm), 20న ఆస్ట్రేలియాతో (3:30 pm) భారత జట్టు వార్మప్ మ్యాచ్లు ఆడుతుంది.
భారత్ ఆడే రెండు మ్యాచులు కూడా దుబాయ్ వేదికగానే జరగనున్నాయి. ఈ మ్యాచులకు ప్రేక్షకులను అనుమతించబోమని ఐసీసీ స్పష్టం చేసింది. మొత్తం 16 వార్మప్ మ్యాచ్లు జరుగుతాయని, వాటిలో 8 మ్యాచ్లు స్టార్ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయని ఐసీసీ తెలిపింది. ఐసీసీ డిజిటల్ వేదికల్లో ఈ మ్యాచ్ల హైలైట్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఇక మెగా టోర్నీలో భారత్ ఆడే తొలి మ్యాచ్ ప్రత్యర్థి దాయాది పాకిస్థాన్ కావడం క్రికెట్ అభిమానుల్లో ఎంతో ఉత్సాహం నింపుతోంది. దాయాదుల మధ్య అక్టోబరు 24న జరగనున్న మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ప్రతిఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ 2021 ప్రైజ్మనీని తాజాగా ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. విజేతగా నిలిచే జట్టుకు రూ.12 కోట్ల (1.6 మిలియన్ అమెరికన్ డాలర్లు) ప్రైజ్మనీ దక్కనుంది. రన్నరప్ జట్టుకు అందులో సగం అంటే.. రూ.6 కోట్లు(0.8 మిలియన్ డాలర్లు) లభించనుంది. ఇక సెమీ ఫైనలిస్ట్ టీమ్స్ రూ. 3 కోట్ల (0.4 మిలియన్ అమెరికన్ డాలర్లు) చొప్పున గెలుచుకోనున్నాయి. రౌండ్-2లో గెలిచే జట్లకు ఒక్క మ్యాచ్కు రూ. 30 లక్షల నగదుపురస్కారం లభించనుంది. రౌండ్ 2 ఎగ్జిట్లో ఒక్కో జట్టుకు రూ.52.59 లక్షలు, రౌండ్1లో గెలిచిన జట్టుకు రూ.30 లక్షల క్యాష్ ప్రైజ్ లభించనుంది.