Sourav Ganguly: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).. మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్మన్గా మరోసారి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి బాధ్యతలు అప్పగించింది. అలానే ఈ కమిటీలో దాదా మాజీ టీమ్ మేట్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా సభ్యుడిగా కొనసాగనున్నట్లు ఐసీసీ తెలిపింది.
అతడి స్థానంలో..
2000 నుంచి 2005 వరకు ఐదేళ్ల పాటు భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన గంగూలీ.. 2021లో తొలి సారి మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా ఎంపికయ్యాడు. అనిల్ కుంబ్లే స్థానంలో గంగూలీ వచ్చి ఈ బాధ్యతలు అందుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఎంపికవ్వడంతో.. ఈ ఛైర్మన్ పదవిలో మరో మూడేళ్ల పాటు కొనసాగనున్నాడు.

మరి కొంతమంది కూడా..
ఈ మెన్స్ క్రికెట్ కమిటీలో దాదా, లక్ష్మణ్ తో పాటు మరి కొంత మంది కూడా సభ్యులుగా నియమితులయ్యారు. వీరిలో అఫ్గానిస్థాన్ మాజీ ప్లేయర్ హమిద్ హసన్, వెస్టిండీస్ బ్యాటింగ్ లెజెండ్ డెస్మండ్ హేన్స్, సౌతాఫ్రికా టెస్ట్, వన్డే కెప్టెన్ టెంబా బవుమా, ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ జొనాథన్ ట్రాట్ ఇతర సభ్యులుగా ఉన్నారు.
మహిళల క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా..
దుబాయ్లో వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఈ ఎంపికలు జరిగాయి. అలానే ఈ సమావేశంలో ఉమెన్స్ క్రికెట్ కమిటీకి కూడా ఛైర్మన్ ను నియమించారు. న్యూజిలాండ్ మాజీ ఆఫ్ స్పిన్నర్ కేథరిన్ క్యాంప్బెల్ ఛైర్ పర్సన్గా ఎంపికైంది. ఇంకా ఈ మహిళల కమిటీలో ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ అవ్రిల్ ఫహే, దక్షిణాఫ్రికాకు చెందిన మొసెకి సభ్యులుగా ఎంపికయ్యారు.