వన్డే వరల్డ్ కప్ నకు భారత్ ఘనంగా ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆటగాళ్ల భద్రత, వారి ప్రాక్టీస్ కు అన్ని సౌకర్యాలు కల్పించింది. ఇక ఫైనల్ చూడటానికి స్టేడియానికి వచ్చిన అభిమానులకు 'షో'లతో ప్రత్యేక అనుభూతిని కల్పించింది. అయితే ఐసీసీ తాజాగా ఫైనల్, సెమీఫైనల్ కు మ్యాచ్ లు జరిగిన పిచ్ లకు రేటింగ్ ఇచ్చింది.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన భారత్-ఆస్ట్రేలియా పిచ్ కు యావరేజ్ రేటింగ్ పాయింట్లు ఇచ్చింది. అలాగే కోల్ కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన రెండో సెమీఫైనల్ పిచ్ కు కూడా యావరేజ్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం. ఫైనల్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులకు ఆలౌటైంది. లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 43 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రెండో సెమీస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 212 పరుగులకు ఆలౌటవ్వగా, ఆసీస్ 47.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

అయితే ముంబయిలోని వాంఖడే వేదికగా జరిగిన భారత్-న్యూజిలాండ్ సెమీస్ పిచ్ కు ఐసీసీ 'గుడ్' రేటింగ్ పాయింట్లు ఇచ్చింది. ఆఖరి నిమిషంలో పిచ్ మార్చారని ఈ మ్యాచ్ గురించి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పరుగుల వరద పారిన ఈ పిచ్ కు మాత్రం ఐసీసీ మంచి పిచ్ గా అభివర్ణించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 397 పరుగులు చేయగా, న్యూజిలాండ్ ఛేదనలో 327 పరుగులకు ఆలౌటైంది.
ప్రపంచకప్ లో టీమిండియా ఆడిన 11 మ్యాచ్ ల్లో మొత్తం 5 పిచ్ లకు ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ తో పాటు ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో ఆడిన పిచ్, లక్నో వేదికగా ఇంగ్లాండ్ తో ఆడిన పిచ్, అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్ తో తలపడిన పిచ్, చెన్నై లో ఆస్ట్రేలియాతో ఆడిన పిచ్ కు యావరేజ్ రేటింగ్ ఇచ్చింది ఐసీసీ.

అయితే గతంలో ఐసీసీ అహ్మదాబాద్, చెన్నై పిచ్ కు ఇచ్చిన రేటింగ్ తీర్పుపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ విమర్శించిన సంగతి తెలిసిందే. 350 పరుగులు సాధించే పిచ్ లు మంచివని భావిస్తే, టీ20 వికెట్లను తయారుచేసుకోవాలని ద్రవిడ్ అన్నాడు. పిచ్ స్పందించిన తీరే కాకుండా ఆటగాళ్ల నైపుణ్యాలను పరిశీలించాలని కోరాడు. ఇప్పుడు ఐసీసీ మరోసారి పరుగులనే ప్రామాణికంగా తీసుకున్నట్లుగా పిచ్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం.