
బుధవారం ఎమ్మారెఫ్ టైర్స్ విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ జఫ్రీత్ బుమ్రాలు అగ్రస్థానంలో నిలిచారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్వన్ బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ.. నెంబర్వన్ బౌలర్గా బుమ్రా తమ టాప్ ప్లేస్లను నిలబెట్టుకున్నారు. విరాట్ ఖాతాలో ప్రస్తుతం 890 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 839 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. రాస్ టేలర్ (831), షై హోప్ (808), డికాక్ (803)లు ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
బౌలర్ల జాబితాలో టాప్ ప్లేస్లో ఉన్న బుమ్రా ఖాతాలో ప్రస్తుతం 774 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ట్రెంట్ బౌల్ట్ (759), రషీద్ ఖాన్ (726), ఇమ్రాన్ తాహిర్ (703), కాగిసో రబడ (702)లు వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆల్రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ షకీబుల్ హసన్ టాప్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 359 రేటింగ్ పాయింట్లతో అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ను (339)ను వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్లో నిలిచాడు.
ఆల్రౌండర్ల జాబితాలో అఫ్గాన్ ఆటగాడు మహ్మద్ నబీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. పాక్ ఆటగాడు ఇమామ్ వసీం, న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ సాంట్నర్లు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా నుంచి టాప్ 10లో ఒక్కరు కూడా లేరు. కేదార్ జాదవ్ 12వ స్థానంలో ఉన్నాడు. మరోవైపు ఐసీసీ ర్యాంకింగ్స్లో మాత్రం భారత్ రెండవ స్థానంలో ఉంది.