
దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం టీ20 ర్యాంకులు ప్రకటించింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ అనంతరం ఐసీసీ తాజాగా ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఐసీసీ టీ20 బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో టీమిండియా బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ (816) మూడో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ (830) అద్భుతంగా రాణించి ర్యాంకింగ్ మెరుగుపరచుకున్నాడు. ఫించ్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని రెండో స్థానంలోకి దూసుకొచ్చాడు. ఇక రెండో స్థానంలో ఉన్న రాహుల్ ఒక స్థానం కోల్పోయి మూడుకు పడిపోయాడు.
టీ20 ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (697) ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ డేవిడ్ మలాన్ (915) అగ్ర స్థానంలో ఉన్నాడు. బాబర్ ఆజమ్ (801), వాండర్ డస్సెన్ (700) టాప్-5లో ఉన్నారు. న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాట్స్ మాన్ మార్టిన్ గుప్టిల్ కూడా మూడు స్థానాలు ఎగబాకి టాప్-10లోకి వచ్చాడు. ఇక టీ20 బౌలింగ్, ఆల్రౌండర్ల జాబితాలో టాప్-10లో ఒక్క భారత ఆటగాడికి చోటు దక్కలేదు. ఆఫ్ఘనిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్ నంబర్ వన్ ర్యాంక్ బౌలర్ కాగా.. అదే దేశానికి చెందిన మొహమ్మద్ నబీ ఆల్రౌండర్ ర్యాంకులో మొదటి స్థానంలో ఉన్నాడు.
విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఇప్పటికే టెస్టుల్లో నంబర్వన్గా కొనసాగుతున్న భారత్.. వన్డేల్లోనూ రెండో ర్యాంకులో ఉంది. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను న్యూజిలాండ్ 3-2తో కైవసం చేసుకోవడంతో ఆసీస్ మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్, ఇంగ్లండ్ మధ్య కేవలం ఏడు పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.
భారత్-ఇంగ్లండ్ మధ్య 5 టీ20ల సిరీస్లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ శుక్రవారం జరగనుంది. టెస్ట్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లీష్ జట్టు ఎలాగైనా పొట్టి కప్ పట్టేయాలనే లక్ష్యంతో ఉంది. ఇందుకోసం ఆటగాళ్లు మోతేరలోని నెట్స్లో చెమటోడ్చుతున్నారు. మరోవైపు తొలి టీ20కి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో టీమిండియా కూడా జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది.