దుబాయ్: టీమిండియా మరోసారి అగ్రస్థానాన్ని అందుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లో నెంబర్వన్ ర్యాంకు సాధించింది. ఇటీవల కోహ్లీ సేన చేతిలో కంగుతిన్న ప్రస్తుత నెంబర్వన్ దక్షిణాఫ్రికా.. స్వదేశంలో ఇంగ్లాండ్ చేతిలోనూ ఓటమి చవిచూడటంతో ఇప్పటిదాకా ద్వితీయ స్థానంలో ఉన్న భారత్కు అగ్రస్థానం దక్కింది.
110 రేటింగ్ పాయింట్లతో ఉన్న కోహ్లి సేన నెంబర్వన్గా నిలవగా, ఆస్ట్రేలియా (109) ద్వితీయ స్థానంలో నిలిచింది. ఐదేళ్ల విరామం తర్వాత భారత్ తిరిగి ఈ టాప్ ర్యాంకును సాధించడం విశేషం. 2011లో ఇంగ్లాండ్ చేతిలో 0-4తో వైట్వాష్కు గురై నెంబర్వన్ ర్యాంకు కోల్పోయిన టీమ్ఇండియా.. అదే జట్టు కారణంగా తిరిగి ఈ ర్యాంకు దక్కించుకోవడం మరో విశేషం.
కాగా, విరాట్ కోహ్లీ సారథ్యంలో ఇటీవల సాధించిన వరుస విజయాలే భారత్ను ర్యాంకింగ్స్లో ముందుకు తీసుకెళ్లాయి. శ్రీలంకతో సిరీస్తో పాటు స్వదేశంలో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.

2009, డిసెంబర్లో మహేంద్రసింగ్ ధోని నాయకత్వంలోని భారత్ తొలిసారి టెస్టుల్లో నెంబర్వన్ ర్యాంకు సాధించింది. అయితే ఇప్పుడు టీమిండియాకు నెంబర్వన్ స్థానం ఎక్కువ కాలం నిలిచే అవకాశాలు తక్కువే.
స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియా కనీసం 1-0తో న్యూజిలాండ్ను ఓడించినా ఆ జట్టు నెంబర్వన్గా నిలుస్తుంది. మరోవైపు వరుస వైఫల్యాలు చవిచూస్తున్న దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఆఖరి టెస్టులోనూ ఓడితే నాలుగో ర్యాంకుకు పడిపోనుంది.
తాజా ర్యాంకింగ్స్
1. ఇండియా(110 రేటింగ్ పాయింట్స్), 2. ఆస్ట్రేలియా(109), 3. దక్షిణాఫ్రికా(107), 4. పాకిస్థాన్(106), 5. ఇంగ్లాండ్(104), 6. న్యూజిలాండ్(100), 7. శ్రీలంక(89), 8. వెస్టిండీస్(76), 9. బంగ్లాదేశ్(47), 10. జింబాబ్వే(5).