మెల్బోర్న్: ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) అధ్యక్షుడు ముస్తఫా కమాల్ ఐసీసీ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీసీ రాజ్యాంగం ప్రకారం... ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు అధ్యక్షుడు ట్రోఫీని ఇవ్వాలి. అయితే, బంగ్లాదేశ్ - భారత్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో ముస్తఫా కమాల్ అంపైరింగ్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ను శ్రీనివాసన్ అందించారు.
దీనిపై ముస్తఫా కమాల్ సోమవారం తీవ్రంగా స్పందించారు. శ్రీనివాసన్ పైన మండిపడ్డారు. ప్రపంచ కప్ వేడుక అనంతరం తాను అన్ని విషయాలను బయట పెడతానని హెచ్చరించారు. ట్రోఫీని అందించే తన హక్కును హరించిన నేపథ్యంలో తాను అన్ని బయటపెడతానన్నారు.
ప్రపంచ కప్ తాను ఇవ్వాల్సి ఉందని, అది తన హక్కు అని, కానీ తనను ఇవ్వనివ్వకపోవడం దారుణమన్నారు. తన హక్కును హరించారన్నారు. తాను తిరిగి వెళ్లాక తాను అన్ని విషయాలను బయటపెడతానని చెప్పారు. తన పట్ల ఇలా వ్యవహరించిన వారు ఎవరో ప్రపంచానికి తెలుసునని శ్రీనివాసన్ను ఉద్దేశించి చెప్పారు.
ఆస్ట్రేలియా జట్టుకు ట్రోఫీని తాను ఇవ్వకుండా ఎందుకు అడ్డుకున్నారో అర్థం కావడం లేదన్నారు. బంగ్లాదేశ్ - భారత్ మ్యాచ్ సమయంలో రోహిత్ శర్మ అవుట్ పైన వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అంపైరింగ్ తప్పిదం వల్లే రోహిత్ అవుట్ కాలేదనే వాదనలు వినిపించాయి.
దీనిపై ముస్తఫా కమాల్ మాట్లాడుతూ.. అంపైరింగ్ తప్పిదం వల్ల అలా జరిగిందని తాను చెప్పానని, తాను ఎవరి పక్షాన మాట్లాడలేదని చెప్పారు. అంతేకాదు, ఈ విషయమై ఐసీసీ ఓ ప్రకటన కూడా విడుదల చేసిందని చెప్పారు. తాను ఏ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు.