
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టుకు ఐసీసీ శనివారం టెస్టు ఛాంపియన్షిప్ గదను బహుకరించనుంది. మూడు టీ20ల సిరిస్లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం రాత్రి 9.30 గంటలకు ఆఖరి టీ20 ప్రారంభం కానుంది. ఈ టీ20 ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ గదను బహురించనుంది.
ఈ మేరకు ఐసీసీ తన ట్విట్టర్లో పేర్కొంది. సఫారీ గడ్డపై మూడు టీ20ల సిరీస్కు సంబంధించిన అవార్డుల కార్యక్రమం ముగిసిన తరువాత..... ఐసీసీ తరఫున ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న సునీల్ గవాస్కర్, పొలాక్లు తమ చేతుల మీదగా గదను టీమిండియా కెప్టెన్ కోహ్లీకి అందించనున్నారు.
సుదీర్ఘమైన సఫారీ పర్యటనకు గతేడాది డిసెంబర్లో కోహ్లీసేన వచ్చిన సంగతి తెలిసిందే. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 1-2తో చేజార్చుకున్న కోహ్లీసేన... ఆరు వన్డేల సిరిస్ను 5-1తో కైవసం చేసుకుంది. అయితే జోహాన్నెస్బర్గ్లో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
దీంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత్ తన నెంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకుంది. అగ్రస్థానంలో ఉన్న టీమిండియాకు గదతో పాటు ఒక మిలియన్ అమెరికా డాలర్లను ప్రైజ్ మనీగా ఇవ్వనుంది. ఏప్రిల్ 3 వరకు గడువు ఉండగా అప్పటి వరకు ఏ జట్టు కూడా పాయింట్ల పట్టికలో భారత్ను అందుకునే అవకాశం లేకపోవడంతో ఐసీసీ ఇప్పుడే గదను బహురించనుంది.