
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ప్లేయర్ల లిస్టు వచ్చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం ఈ మేరకు ఓ ప్రకటన రిలీజ్ చేసింది. మెన్స్ క్రికెట్లో నామినేట్ అయిన ముగ్గురు ప్లేయర్లలో ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్, జింబాబ్వే స్టార్ ఆల్రౌండర్ సికిందర్ రజా, న్యూజిలాండ్ ఆల్రౌండర్ మిచెల్ సాంట్నర్ ఉన్నారు.
ఇంగ్లాండ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగుతోన్న టెస్టు సిరీస్లో బెన్ స్టోక్స్ రెండో టెస్టులో నాలుగు వికెట్లతో పాటు సెంచరీ చేసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రస్తుతం 1-1 తో సమంగా ఉంది. మూడో టెస్ట్ డిసైడర్ కానుంది. జింబాబ్వే స్టార్ ప్లేయర్ సికిందర్ రజా ప్రస్తుతం కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్ కనబర్చుతున్నాడు. ఆగస్టులో బంగ్లాదేశ్, భారత్తో జరిగిన సిరీస్లలో సికిందర్ కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. బంగ్లాదేశ్తో సిరీస్లో రెండు సెంచరీలు బాదిన సికిందర్ రజా.. ఆ జట్టు వన్డే సిరీస్ను 2-1తేడాతో గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఇండియాపై మూడో టెస్టులో సెంచరీ బాదిన రజా.. దాదాపు జట్టును గెలుపు అంచుల వరకు చేర్చాడు. కానీ చివర్లో క్యాచ్ ఔట్ అవ్వడంతో ఇండియా గెలుపొందింది. ఈ నెలలో రజా మూడు సెంచరీలు నమోదు చేయడం విశేషం. అలాగే బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను సైతం జింబాబ్వే కైవసం చేసుకోవడంలో రజా కీలక పాత్ర పోషించాడు.