
దుబాయ్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచుకు ముందు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 'అల్టిమేట్ టెస్ట్ సిరీస్'ను ప్రకటించింది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన 2020/21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 'అల్టిమేట్ టెస్ట్ సిరీస్'గా ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఫైనల్ రేసులో ఉన్న 1999 భారత్-పాకిస్తాన్ సిరీస్పై ఫాన్స్ ఆసక్తిచూపలేదు. ఆద్యాంతం రసవత్తరంగా సాగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్కు 70.9% ఓట్లు రాగా.. భారత్-పాకిస్తాన్ సిరీస్కు 29.1% ఓట్లు వచ్చాయి. దీంతో భారీ మెజారిటీతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఐసీసీ కిరీటాన్ని దక్కించుకుంది.
గత నెల చివరలో 'అల్టిమేట్ టెస్ట్ సిరీస్' కోసం 16 సిరీస్లను షార్ట్లిస్ట్ చేసింది ఐసీసీ. 2001 భారత్ vs ఆస్ట్రేలియా, 2014 ఇంగ్లండ్ vs శ్రీలంక, 2008-09 ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, 1882 ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా, 2020-21 భారత్ vs ఆస్ట్రేలియా, 1936-37 ఆస్ట్రేలియా va ఇంగ్లండ్, 1999 వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా, 1999 భారత్ vs పాకిస్తాన్, 1960-61 ఆస్ట్రేలియా vs వెస్టిండీస్,1985-86 ఆస్ట్రేలియా vs న్యూజీలాండ్, 2005 ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా, 1984 ఇంగ్లండ్ vs వెస్టిండీస్, 1981 ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా, 1995 వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లను ఐసీసీ షార్ట్లిస్ట్ చేసింది. ఐసీసీ తమ సోషల్ మీడియా ద్వారా కాంటెస్ట్ నిర్వహించగా.. 1999 భారత్-పాకిస్తాన్, 2020-21 బోర్డర్-గవాస్కర్ సిరీస్లు ఫైనల్ చేరాయి. ఫైనల్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 'అల్టిమేట్ టెస్ట్ సిరీస్' కిరీటం దక్కించుకుంది.
కంగారో గడ్డపై భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన 2020/21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆద్యాంతం రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే. భారత్ 2-1తో టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. పెటర్నిటీ లీవ్పై బోర్డర్-గవాస్కర్ సిరీస్లోని మూడు మ్యాచ్లకు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమవ్వగా.. తాత్కలిక సారథిగా అజింక్య రహానే జట్టును నడిపించాడు. సూపర్ కెప్టెన్సీతో పాటు యువ ఆటగాళ్ల అండతో ఆసీస్ను సొంతగడ్డపై ఓడించి 2-1తో సిరీస్ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాడు. తోలి టెస్టులో ఆసీస్, రెండో టెస్టులో భారత్ గెలుపొందాయి. మూడో మ్యాచ్ డ్రా అయింది. ఆస్ట్రేలియాకు కంచుకోట అయిన గబ్బాలో భారత్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లు సత్తాచాటడంతో ఆసీస్ ఓటమిపాలైంది.