ఎప్పుడూ ఆవేశంగా ఉంటూ, వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారే బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకిబ్ అల్ హసన్ ఇటీవల మరోసారి తన దురుసు ప్రవర్తనతో విమర్శల పాలైన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్పై కోపంతో బంతి విసిరిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వెంటనే అంపైర్లకు షకిబ్ క్షమాపణ చెప్పినప్పటికీ.. అతనిపై ఐసీసీ చర్యలు తీసుకుంది.
అసలేం జరిగిందంటే.. రావల్పిండి వేదికగా పాకిస్థాన్ - బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టెస్టు అయిదో రోజు ఆటలో షకిబ్ తన కోపాన్ని నియంత్రించుకోలేకపోయాడు. షకిబ్ 33వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అయితే రెండో బంతిని ఎదుర్కోవడానికి రిజ్వాన్ కాస్త సమయం తీసుకున్నాడు. మరోవైపు కావాలనే ఆలస్యం చేస్తున్నాడని షకిబ్ కోపంతో రిజ్వాన్ తలకు మీదుగా బంతి విసిరాడు.

షకిబ్ నుంచి ఈ ప్రవర్తన చూసి పాకిస్థాన్ బ్యాటర్లు, అంపైర్లతో పాటు బంగ్లాదేశ్ ఫీల్డర్లు సైతం ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనపై అంపైర్ కెటిల్ బారో తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. షకిబ్ మాత్రం తనదే తప్పుంటూ దాన్ని అక్కడితో ముగించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం అంపైర్ రిఫరికీ ఈ సంఘటన గురించి నివేదిక అందించాడు. దీనిపై రిఫరీ చర్యలు తీసుకున్నారు. షకిబ్ మ్యాచ్ ఫీజులో పది శాతం జరిమానాతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ను శిక్షగా విధించారు.
కాగా, పాకిస్థాన్పై బంగ్లాదేశ్ చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే. టెస్టు ఫార్మాట్లో పాక్పై తొలిసారి గెలుపు రుచి చూసింది. అంతేగాక స్వదేశంలో టెస్టు ఫార్మాట్లో ప్రత్యర్థి చేతిలో పది వికెట్ల తేడాతో ఓటమిపాలవ్వడం పాకిస్థాన్కు ఇదే ప్రథమం. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 448/6 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా బంగ్లాదేశ్ 565 పరుగుల భారీ స్కోరు సాధించింది. 117 పరుగుల వెనుకంజతో బ్యాటింగ్కు వచ్చిన పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్లో 146 స్కోరే సాధించింది. అనంతరం 30 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది.