బంగ్లాదేశ్ యువ పేసర్ తన్జీమ్ హసన్ సకిబ్పై ఐసీసీ కొరడా ఝుళిపించింది. నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్తో గొడవకు దిగిన కారణంగా తన్జీమ్పై జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించినట్లు తెలిపింది. అంతేగాక ఓ డీమెరిట్ పాయింటుతో మందలించింది. గత 24 నెలలో తన్జీమ్కు ఇదే తొలి డీమెరిట్ పాయింట్.
రెండేళ్ల కాలంలో ఓ ఆటగాడికి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు వస్తే అవి సస్పెన్షన్ పాయింట్లగా కన్వర్ట్ అవుతాయి. రెండు సస్పెన్షన్ల పాయింట్లకు రెండు వన్డేలు, రెండు టీ20లు లేదా ఓ టెస్టు మ్యాచ్కు సదరు ప్లేయర్ నిషేధానికి గురవుతాడు. రోహిత్ను మైదానంలో ఢీకొని, ఆర్టికల్ 2.12 నిబంధనను ఉల్లఘించిన కారణంగా తన్జీమ్పై జరిమానా విధించినట్లు ఐసీసీ తెలిపింది.

కింగ్స్ టౌన్ వేదికగా సోమవారం బంగ్లాదేశ్-నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓవర్ ముగిసిన అనంతరం నేపాల్ కెప్టెన్ రోహిత్ దగ్గరకు తన్జీమ్ వెళ్లి ఢీకొట్టడమే కాకుండా, కవ్వించే మాటలతో దురుసుగా ప్రవర్తించాడు. ఈ పోరులో బంగ్లా 21 పరుగుల తేడాతో నెగ్గి సూపర్-8కు అర్హత సాధించింది.తన్జీమ్ (4/7) నిప్పులు చెరిగే బంతులతో బంగ్లా విజయంలో కీలకపాత్ర పోషించాడు.
రెండు ఓవర్లు మెయిడిన్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అతను సంధించిన బంతుల్లో ఏకంగా 21 బంతులకు పరుగులేమి రాకపోవడం గమనార్హం. మొదట బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. షకిబ్ అల్ హసన్ (17; 22 బంతుల్లో, 2 ఫోర్లు) టాప్ స్కోరర్. సోంపాల్ (2/10), సందీప్ లమిచానె (2/17), రోహిత్ పాడెల్ (2/20), దీపేంద్ర సింగ్ (2/22) తలో రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం ఛేదనలో నేపాల్ 19.2 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటైంది.
కుశాల్ మల్ల (27; 40 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్), దీపేంద్ర సింగ్ (25; 31 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించింది. తన్జీమ్ (4/7) నాలుగు వికెట్లు, ముస్తాఫిజుర్ రెహ్మన్ (3/7) మూడు వికెట్లతో విజృంభించారు.