టీ20 వరల్డ్ కప్ 2026 వేదికగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు మరో స్థాయికి చేరుకుంది. మైదానంలో జరగాల్సిన పోరు కాస్త ఇప్పుడు తీవ్రస్థాయి బెదిరింపులకు దారితీసింది. పాకిస్థాన్కు చెందిన ఓ ప్రముఖ యూట్యూబర్ ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కార్యాలయాన్ని బాంబులతో పేల్చివేస్తామంటూ బహిరంగంగా బెదిరింపులకు పాల్పడటం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో కలకలం రేపుతోంది.
వివాదం ముదిరిందిలా!
ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబోలో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. అయితే ఐసీసీ దీనిపై తీవ్రంగా స్పందించింది. ఒకవేళ పాక్ జట్టు మ్యాచ్ ఆడకపోతే భారీ జరిమానాతో పాటు అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఐసీసీ తీసుకున్న ఈ కఠిన నిర్ణయంపై పాక్ అభిమానులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాక్ యూట్యూబర్ అర్స్లాన్ నాసిర్ వివాదాస్పద కామెంట్స్
ఈ క్రమంలో అర్స్లాన్ నాసిర్ అనే పాకిస్థాన్ యూట్యూబర్ సుమారు 15 నిమిషాల నిడివి గల వీడియోను విడుదల చేశాడు. అందులో ఐసీసీ, బీసీసీఐ అధికారులపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. "ఐసీసీ ఆఫీసు దుబాయ్లో ఉంది కాబట్టే అది సురక్షితంగా ఉంది. అదే గనుక భారత్లో ఉండి ఉంటే, మా వాళ్లు ఇప్పటికే ఆ ఆఫీసును, చుట్టుపక్కల ప్రాంతాన్ని బాంబులతో పేల్చివేసేవారు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియోలో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఐసీసీ ఛైర్మన్ జై షాపై అత్యంత నీచమైన రీతిలో కామెంట్స్ చేశాడు. గతంలో ఆసియా కప్ సందర్భంగా జరిగిన 'హ్యాండ్షేక్' వివాదాన్ని గుర్తు చేస్తూ దూషించాడు. ఈ వీడియోలో 'కామెడీ','హిలేరియస్ రివ్యూ' అని రాసి ఉన్నప్పటికీ, అతని మాట తీరు మాత్రం తీవ్రమైన బెదిరింపు ధోరణిలోనే ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు.
పాకిస్థాన్పై వేటు పడే అవకాశం?
ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఒకవేళ పాకిస్థాన్ ఈ మ్యాచ్ను బహిష్కరిస్తే ఆ దేశ క్రికెట్ బోర్డు (PCB) భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దాదాపు 35 మిలియన్ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఐసీసీ నుంచి పాకిస్థాన్కు వచ్చే వార్షిక ఆదాయ వాటాను నిలిపివేయవచ్చు. అంతర్జాతీయ టోర్నమెంట్ల నుంచి పాక్ను బహిష్కరించే వీలుంది. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ.. తెర వెనుక ఐసీసీ, పీసీబీ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.