ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్లో నేపాల్ జట్టు పోటీలోనే ఉంది. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో నేపాల్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ 207 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు వికెట్ కీపర్ షాయన్ జహంగీర్ (100 నాటౌట్) సెంచరీతో చెలరేగినా మిగతా బ్యాటర్లు తేలిపోయారు.
ఇలా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో యూఎస్ఏ జట్టు అనుకున్నంత భారీ స్కోరు చేయలేకపోయింది. నేపాల్ బౌలర్లలో కరణ్ కేసీ తొమ్మిది ఓవర్లు వేసి కేవలం 33 పరుగులే ఇచ్చాడు. వీటిలో మూడు మెయిడెన్లు కూడా ఉండటం గమనార్హం. అలాగే నాలుగు కీలక వికెట్లు కూడా తీసుకున్నాడు. అతనికితోడు గుల్షన్ ఝా మూడు వికెట్లతో రాణించాడు. దీంతో యూఎస్ఏ జట్టు ఏ దశలోనూ భారీ స్కోరు చేసేలా కనిపించలేదు.

అనంతరం బ్యాటింగ్కు వచ్చిన నేపాల్కు అనుకున్న ఆరంభం లభించలేదు. ఓపెనర్ ఆసిఫ్ షేక్ (16) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. అయితే కుశాల్ భూర్టెట్ (39), భీమ్ షర్కీ (77 నాటౌట్) ఇద్దరూ కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో దీపేంద్ర సింగ్ (39 నాటౌట్) కూడా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంత నేపాల్ జట్టు సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.
కేవలం 43 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. యూఎస్ఏ బౌలర్లలో సౌరభ్ నేత్రవాకర్, నోతూష్ కెన్యిగే, నిసర్గ్ పటేల్, స్టీవెన్ టేలర్ తలో వికెట్ తీసుకున్నారు. కానీ వాళ్లు కూడా అనుకున్నట్లు బౌలింగ్ చేయలేకపోయారు. దీంతో నేపాల్ పట్టుదలగా విజయం దిశగా సాగింది. చివరకు రెండు పాయిట్లను తమ ఖాతాలో వేసుకుంది.
అయితే పాయింట్ల పట్టికలో యూఎస్ఏ ఇప్పటి వరకు ఖాతా తెరవకపోవడం గమనార్హం. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఈ జట్టు ఓటమిపాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో జింబాబ్వే నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. వెస్టిండీస్ రెండు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. నేపాల్ కూడా రెండు పాయింట్లతో ఉన్నా.. నెట్ రన్ రేట్ కారణంగా విండీస్ పైస్థానంలో ఉంది.