డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమితో మరో ఐసీసీ టోర్నీలో భారత ఫ్లాప్ షో కనిపించింది. ఈ క్రమంలో మరో ఐసీసీ ట్రోఫీ కోసం భారత అభిమానులు ఎదురు చూస్తున్నారు. అదే ఈ ఏడాది చివర్లో వన్డే వరల్డ్ కప్. భారత్ వేదికగా జరిగే ఈ భారీ టోర్నీకి సంబంధించిన డ్రాప్ట్ షెడ్యూల్ బయటకు వచ్చింది. ఇప్పటికే బీసీసీఐ దీన్ని ఐసీసీకి పంపించిందట. దీన్ని ఐసీసీ తమ సభ్య దేశాలకు పంపినట్లు సమాచారం.
ఈ షెడ్యూట్ ప్రకారం అభిమానులంతా ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూసే భారత్, పాకిస్తాన్ మ్యాచ్కు కూడా ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ అక్టోబరు 15న గుజరాత్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతుందట. అహ్మదాబాద్లోని ఈ స్టేడియంలో లక్ష మందికి పైగా కూర్చొనే వీలుంటుంది. దీంతో స్టేడియం టికెట్ల అమ్మకాలు కూడా భారీగా ఉంటాయని బీసీసీఐ భావిస్తోంది.

ఇక ఈ టోర్నీ భారత్లో తొమ్మిది వేదికల్లో జరుగుతుందని తెలుస్తోంది. బీసీసీఐ రూపొందించిన షెడ్యూల్ను సభ్య దేశాలకు ఐసీసీ పంపిందట. ఈ షెడ్యూల్పై నిర్ణయం చెప్పాలని అడిగిందట. ఈ షెడ్యూల్ ప్రకారం 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనలిస్టులైన న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ జట్లు.. ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్లో ఢీకొంటాయి. ఈ మ్యాచ్ అక్టోబర్ 5న జరుగుతుంది.
ఇక భారత జట్టు అక్టోబర్ 8న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఇక ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచులు తొమ్మిది స్టేడియాల్లో జరగనున్నాయి. అవేంటంటే.. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పూణే, ధర్మశాల, లక్నో, ముంబై, కోల్కతా. అదే సమయంలో పాకిస్తాన్ ఆడే రెండు మ్యాచులకు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తుంది.