తాజా వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూసుకెళ్లాడు. టాప్ -5లోకి ఎంట్రీ ఇచ్చాడు. రీసెంట్ గానే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్ పై అజేయ శతకం బాదడంతో ఈ మార్క్ ను టచ్ చేశాడు. ప్రస్తుతం అతడు ఐదో ర్యాంకును సంపాదించుకున్నాడు.
టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్.. ఇటీవలే పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజామ్ ను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజా ర్యాంకింగ్స్ లో మళ్లీ తన స్థానాన్ని కాపాడుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ తన మూడో ర్యాంకులోనే ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ 679 పాయింట్లతో తన 9వ స్థానంలోనే ఉన్నాడు. మొత్తంగా టాప్ -10లో నలుగురు టీమిండియా బ్యాటర్లు ఉండటం విశేషం.

వన్డేల్లో టాప్-5 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఉన్న ఆటగాళ్లు వీరే
శుభ్మన్ గిల్ (టీమిండియా) - 817 పాయింట్లు
బాబర్ ఆజామ్ (పాకిస్థాన్) - 770 పాయింట్లు
రోహిత్ శర్మ (టీమిండియా) - 757 పాయింట్లు
హెన్రిచ్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) - 749 పాయింట్లు
విరాట్ కోహ్లీ (టీమిండియా) - 743 రేటింగ్ పాయింట్లు
పడిపోయిన సిరాజ్.. మెరుగైన షమీ..
బౌలింగ్ ర్యాంకింగ్స్ విభాగంలో శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ 680 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. రషీద్ ఖాన్ (అప్ఘానిస్థాన్), కుల్దీప్ (భారత్).. 658, 656 పాయింట్లతో రెండు,మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. కేశవ్ మహరాజ్ (దక్షిణాఫ్రికా) 641 పాయింట్లు, బెర్నార్డ్ స్కోల్ట్జ్ (నమీబియా) 641 పాయింట్లతో తర్వాతి ర్యాంకుల్లో నిలిచారు. మహ్మద్ సిరాజ్ రెండు స్థానాలు కిందకి పడిపోయి 12వ స్థానంలో నిలవగా.. షమి ఒక స్థానం మెరుగుపరుచుకుని 14వ ర్యాంకును అందుకున్నాడు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ విభాగంలో అఫ్గానిస్థాన్ ప్లేయర్ మహ్మద్ నబీ అగ్రస్థానంలో ఉండగా, రవీంద్ర జడేజా 9వ ర్యాంకులో ఉన్నాడు.