దుబాయ్: ఇంగ్లండ్తో టెస్టు, టీ20 సిరీస్లను కైవసం చేసుకున్న టీమిండియా.. ఆదివారం వన్డే సిరీస్నూ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పూణే వేదికగా ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో భారత్ 7 పరుగుల తేడాతో నెగ్గి 2-1తో సిరీస్ను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్పై సిరీస్ విజయం తర్వాత ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్లో భారత్ రెండో స్థానానికి దూసుకెళ్లింది. సిరీస్ కోల్పోయినా.. టీం ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
టీమిండియా చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్.. 121 రేటింగ్ పాయింట్లతో నంబర్వన్ జట్టుగా కొనసాగుతోంది. వన్డే సిరీస్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. దీంతో న్యూజిలాండ్ (118)ను మూడో స్థానానికి నెట్టిన భారత్.. 119 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఇరుజట్ల మధ్య ఒక్క పాయింట్ మాత్రమే తేడా ఉంది. ఆస్ట్రేలియా 111 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. 108 పాయింట్లతో దక్షిణాఫ్రికా ఐదో ర్యాంకులో నిలిచింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
టెస్టు, టీ20 సిరీస్లు సొంతం చేసుకున్న టీమిండియా అదే జోరులో వన్డేల్లోనూ ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ను చిత్తుచేసింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరి వన్డేలో కోహ్లీసేన 7 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. వరుసగా మూడో మ్యాచ్లోనూ మొదట బ్యాటింగ్కు దిగిన కోహ్లీసేన 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్ (78; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), శిఖర్ ధావన్ (67; 10 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ శతకాలు సాధించారు. ప్రత్యర్థి బౌలర్లలో మార్క్ వుడ్ (3/34), ఆదిల్ రషీద్ (2/81) రాణించారు.
అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 322 పరుగులు చేసి ఓడిపోయింది. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్కు శుభారంభం దక్కలేదు. జాసన్ రాయ్ (14)ను భువనేశ్వర్ తొలి ఓవర్లోనే ఔట్ చేశాడు. కాసేపటికే బెయిర్స్టో (1) కూడా అతడికే చిక్కాడు. ఈ దశలో స్టోక్స్ (35), బట్లర్ (15) కూడా వెనుదిరగడంతో ఇంగ్లండ్ 95 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.
మలన్తో పాటు లివింగ్స్టోన్ (36), అలీ (29) కాస్త పోరాడారు. 31 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 200/7తో నిలిచింది. మిగిలిన మూడు వికెట్లు పడగొట్టి భారత్ సిరీస్ పట్టేయడానికి ఇంకెంతో సమయం పట్టదనుకుంటే.. సామ్ కరన్ (95) అద్వితీయ పోరాటంతో చివరి బంతి వరకు టీమిండియాను వణికించాడు. భువనేశ్వర్, హార్దిక్, నటరాజన్ పొదుపుగా బౌలింగ్ చేసి భారత్ను గెలిపించారు.
IPL 2021: రాత్రికి రాత్రే ముంబై చెక్కేసిన హార్దిక్, కృనాల్, సూర్యకుమార్!!