హైదరాబాద్: మ్యాచ్ ఫలితాన్ని సగం వరకూ ముందుగానే అంచనా వేయగలిగా టాస్ను త్వరలో తీసేయనున్నారట. ఈ దిశగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్చలు జరుపుతోంది. క్రికెట్ మ్యాచ్లు వీక్షించే ప్రతి ఒక్కరికీ టాస్కు ఉండే విశిష్టత గురించి తెలుసు. మ్యాచ్లో ఏ జట్టు ముందుగా బ్యాటింగ్, బౌలింగ్ చేపట్టాలనేది టాస్ మీదే ఆధారపడి ఉంటుంది. 1877లో అంతర్జాతీయ క్రికెట్ ఆరంభం అయినప్పటి నుంచి ఈ విధానం అమల్లో ఉంది.
తొలుత బ్యాటింగ్, బౌలింగ్లో ఏది ఎంచుకోవచ్చనేది టాస్ గెలిచిన కెప్టెన్ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్లలో టాస్ విధానం ద్వారా అతిథ్య జట్టుకు ప్రయోజనం చేకూరుతుందనే విమర్శలు ఎక్కువయ్యాయి. పిచ్ల ఏర్పాటు అనేది అతిథ్య జట్టు మీదే ఆధారపడి ఉండటంతో టాస్ గెలిస్తే పిచ్ బ్యాటింగ్, బౌలింగ్లలో దేనికి అనుకూలిస్తే వారు దాన్నే ఎంచుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఐసీసీ ఈ పద్ధతిపై చర్చలు నిర్వహించనుంది.
ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చించేందుకు ఐసీసీ నియమించిన కమిటీ మే 28, 29 తేదీలలో ముంబైలో సమావేశం కానున్నట్టు సమాచారం. ఈ కమిటీలో ప్రముఖ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, ఆండ్రూ స్ట్రాస్, మహేళ జయవర్దనే, రాహుల్ ద్రవిడ్, టిమ్ మే, న్యూజిలాండ్ క్రికెట్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్, థర్డ్ అంపైర్ రిచర్డ్, ఐసీసీ రిఫరీలు రంజన్, షాన్ పొలాక్లు సభ్యులుగా ఉండే అవకాశం ఉంది.
ఇంతకుముందే భారత్లో కూడా దేశవాలీ క్రికెట్లో టాస్కు స్వస్తి చెప్పే ప్రతిపాదన వచ్చింది. కానీ, కొన్ని అనివార్యకారణాల వల్ల అది చర్చలు దగ్గరే ఆగిపోయింది.