వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ వేదికలపై కొంత క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. యూఎస్, వెస్టిండీస్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉంది. అయితే యూఎస్ఏలో క్రికెట్ మైదానాల్లో అన్ని సదుపాయాలు కల్పించడానికి సమయం పడుతుందని, కాబట్టి ఈ టోర్నీని ఇంగ్లండ్కు తరలించే అవకాశం ఉందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
అయితే వరల్డ్ కప్ వేదిక మార్చాలని ఐసీసీ అనుకోవడం లేదని ఆ తర్వాత తెలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో వార్త.. ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చింది. యూఎస్ఏలోని డల్లాస్, మియామి, న్యూయార్క్ నగరాల్లో టీ20 వరల్డ్ కప్ మ్యాచులు నిర్వహించనున్నట్లు ఐసీసీ ధ్రువీకరించింది. అంటే ఈ మెగా టోర్నీ వేదిక మారడం లేదన్నమాట.

డల్లాస్లోని గ్రాండ్ ప్రయరీ, ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ, న్యూయార్క్లోని నాసో కౌంటీల్లో టీ20 వరల్డ్ కప్ మ్యాచులు జరగనున్నాయి. యూఎస్ఏలోని వేదికలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. అలాగే టీ20 వరల్డ్ కప్ కోసం ఇక్కడి సదుపాయాలను మరింత మెరుగు పరిచేందుకు కూడా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
న్యూయార్క్లోని ఐజన్హోవర్ పార్క్లో 34 వేల మంది కూర్చునే విధంగా మాడ్యులర్ స్టేడియం నిర్మించనున్నారు. దీనికి ఒప్పందం కూడా జరిగింది. వచ్చే నెలలో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ నిర్మాణం మొదలవుతుంది. ఇదే విధానంలో డల్లాస్, మియామిల్లోని స్టేడియాల్లో కూడా మరింత మంది ప్రేక్షకులు కూర్చునేలా మార్పులు చేయనున్నారు.
ఈ మూడు వేదికలను ఎంపిక చేసిన సందర్భంగా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్ అల్లర్డైస్ సంతోషం వ్యక్తం చేశాడు. 'చరిత్రలోనే అతిపెద్ద టీ20 వరల్డ్ కప్లో కొన్ని మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చే యూఎస్ఏ వేదికలను ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు ట్రోఫీ కోసం తలపడతాయి. యూఎస్ఏ వంటి అతిపెద్ద మార్కెట్పై ప్రభావం చూపడానికి ఈ వేదికలు కచ్చితంగా ఉపయోగపడతాయి' అని చెప్పాడు.