
టెస్టులు ఇక నాలుగు రోజులే
ఐసీసీ సంప్రదాయ క్రికెట్ను తప్పనిసరిగా కుదించాలనే ఆలోచనలో ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే 2023 నుంచి ఐదు రోజుల ఆట నాలుగు రోజులకే పరిమితం కానుంది. 2023-2031 మధ్య కాలంలో టెస్టులను ఐదు రోజులు కాకుండా నాలుగు రోజుల పాటు నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. దీంతో బిజీగా ఉండే అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్లో ఆయా బోర్డులకు విరామం దొరుకుతుంది. ఈ సమయంలో మరిన్ని గ్లోబల్ ఈవెంట్స్ నిర్వహణకు వీలవుతుందని ఐసీసీ ఆలోచన.

335 రోజుల విరామం దొరికేది
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ద్వైపాక్షిక సిరీస్లు పెరగాలని గతంలో డిమాండ్ చేసింది. ద్వైపాక్షిక సిరీస్లతో పాటు లీగ్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని బీసీసీఐ చేసిన ప్రతిపాదనల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఒకవేళ 2015-2023 మధ్య ఈ నాలుగు రోజుల టెస్టులు జరిగుంటే 335 రోజుల విరామం దొరికేది.

కొత్తేం కాదు
అంతర్జాతీయ క్రికెట్లో నాలుగు రోజుల టెస్టులు కొత్తేం కాదు. ఇదివరకే ఈ ఏడాది ఇంగ్లండ్, ఐర్లాండ్ల మధ్య నాలుగు రోజుల టెస్టు జరిగింది. 2017లోనూ దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు నాలుగు రోజుల మ్యాచ్ ఆడాయి. ఈ మార్పు స్వాగతించదగినదే అని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ కెవిన్ రాబర్ట్స్ అభిప్రాయపడ్డాడు.

ఇపుడే స్పందిస్తే తొందరపాటే
నాలుగు రోజుల టెస్టుకు ఇంకా చాలా రోజులు పడుతుందని దీనిపై ఇప్పుడే స్పందిస్తే తొందరపాటే అవుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. 'ముందుగా వారి ప్రతిపాదన పరిశీలించాలి. అది ఆచరణలోకి వచ్చాక ఆలోచించవచ్చు. ఇప్పుడే స్పందించడం తొందరపాటు అవుతుంది' అని దాదా పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications
