
దుబాయ్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021కు సమయం ఆసన్నమవుతోంది. అక్టోబర్ 17న ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్.. నవంబర్ 14తో ముగియనుంది. యూఏఈ, ఒమన్ దేశాలు మెగా టోర్నమెంట్కు ఆతిథ్యమివ్వనున్నాయి. అన్ని జట్లు మెగా టోర్నీ కోసం తమ జట్లను ప్రకటించాయి. నెల రోజుల్లో ప్రారంభం అయ్యే ప్రపంచకప్ కోసం ప్లేయర్స్ అందరూ సిద్ధమవుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లోని అనుభవాన్ని పొట్టి కప్లో ఉపయోగించుకునే పనిలో అన్ని జట్టు నిమగ్నమయ్యాయి. తాజాగా ఐసీసీ ప్రపంచకప్ 2021 థీమ్ సాంగ్ను విడుదల చేసింది.
భారత్ ఆధ్వర్యంలో యూఏఈ, ఒమన్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ 2021లో 16 జట్లు పాల్గొంటాయి. ఈ క్రమంలో ప్రపంచకప్ పోటీలకు సంబంధించి ఐసీసీ ప్రత్యేకగీతాన్ని రూపొందించింది. 'లివ్ ద గేమ్.. లవ్ ద గేమ్' థీమ్తో వీడియోను ఐసీసీ రూపొందించింది. భారతీయ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది అద్భుతంగా కంపోజ్ చేసిన వీడియోలో ప్రపంచకప్ 2021లో పాల్గొనే జట్ల జెర్సీలను, జాతీయ జెండాలను చూపించారు. బ్యాక్గ్రౌండ్లో వినసొంపైన మ్యూజిక్తో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెస్టిండీస్ సారథి కీరన్ పొలార్డ్, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్, అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. అవతార్ యానిమేషన్ క్యారెక్టర్లతో గ్రౌండ్లోకి దూకుతూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశారు. టీ20 ప్రపంచకప్ కోసం ఒకరికొకరు పోటీ పడుతున్నట్లు ఐసీసీ థీమ్ సాంగ్లో చూపించింది.
థీమ్ సాంగ్లో అవతార్ యానిమేషన్ సరికొత్త ప్రసార సాంకేతికతను ఉపయోగించింది. వీడియో 2D, 3D సాంకేతికలను కలిగిఉంది. దీన్ని రూపొందించడానికి డిజైనర్లు, మోడలర్లు, మ్యాట్ పెయింటర్లు, యానిమేటర్లు, లైటర్లు, కంపోజిటర్లు.. ఇలా 40 మందిని ఐసీసీ తీసుకుంది. ఈ వీడియోపై కీరన్ పొలార్డ్ స్పందించాడు. అన్ని వయసుల అభిమానులను ఆకర్షించేందుకు టీ20 క్రికెట్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నాడు. యూఏఈలో సందడి చేయడానికి నేను సిద్ధం అని పేర్కొన్నాడు. 'ఐసీసీ టీ20 ప్రపంచకప్ చాలా కష్టమైనది. అలాగే ఉత్తేజకరమైనది. ట్రోఫీని గెలుచుకోగల సత్తా చాలా జట్లకు ఉంది. ప్రతీ మ్యాచ్ ఫైనల్ లాగే ఉంటుంది. టోర్నీ కోసం నేను ఆత్రుతగా ఎదురుచూస్తున్నా' అని మ్యాక్సీ అన్నాడు.
పాకిస్థాన్, భారత్ జట్లు టీ20 ప్రపంచకప్ 2021లో గ్రూప్ -2 లో ఉన్నాయి. దాయాది దేశాల మధ్య మొదటి పోరు జరుగనుంది. అక్టోబర్ 24న ఈ మ్యాచ్ జరగనుంది. భారత్, పాక్ జట్లతో పాటు న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉన్నాయి. ఈ నాలుగు జట్లతో పాటు క్వాలిఫైయింగ్ రౌండ్ నుంచి మరో రెండు జట్లు వస్తాయి. అక్టోబర్ 31న న్యూజిలాండ్తో, నవంబర్ 3న ఆఫ్ఘనిస్తాన్తో భారత్ తలపడనుంది. అలాగే నవంబర్ 5, 8వ తేదీలలో మరో రెండు మ్యాచ్లు (క్వాలిఫైయర్ జట్లు) ఆడనుంది.