|
21న షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది సెకండాఫ్లో ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 13 నుంచి నవంబర్ 16 మధ్య ఐసీసీ 2022 టీ20 వరల్డ్కప్ జరగనుంది. ఈ వరల్డ్కప్నకు సంబంధించి తదితర వివరాలను ఈ నెల 21న వెల్లడించనున్నట్లు ఐసీసీ తెలిపింది. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అలాగే పలు మ్యాచ్ల కోసం టిక్కెట్ల అమ్మకం కూడా ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. మొత్తం 12 జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. కాగా కరోనా కారణంగా 2020లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ 2021లో జరిగిన సంగతి తెలిసిందే.
మొత్తం ఎన్ని మ్యాచ్లంటే
మొత్తం ఈ టోర్నీలో 45 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ 45 మ్యాచ్లు 7 వేదికలలో జరగనున్నాయి. అడిలైడ్, బ్రిస్బేన్, గీలాంగ్, హోబర్ట్, మెల్బోర్న్, పెర్త్, సిడ్నీ మైదానాలు ఈ ప్రపంచకప్నకు వేదికలుగా నిలువనున్నాయి. సిడ్నీ, అడిలైడ్ వేదికల్లో నవంబర్ 9, 10వ తేదీల్లో సెమీ ఫైనల్స్ జరగనున్నాయి. ఇక నవంబర్ 13న మెల్బోర్న్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. కాగా ఇది ఎనిమిదో ఐసీసీ టీ20 ప్రపంచకప్.
8 జట్లకు నేరుగా అర్హత
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ను బట్టి మొత్తం 8 జట్లు ఇప్పటికే ప్రపంచకప్నకు నేరుగా అర్హత సాధించాయి. ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ప్రపంచకప్నకు అర్హత సాధించిన వాటిలో ఉన్నాయి. ఇక మిగతా నాలుగు స్థానాల కోసం క్వాలిఫైయర్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. గత ప్రపంచకప్లో సూపర్ 12లో ఆడిన నమీబియా, స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు ఈ సారి కూడా క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడనున్నాయి.
2021 విజేత ఆస్ట్రేలియా
యూఏఈ వేదికగా 2021 సెకండాఫ్లో జరిగిన గత టీ20 ప్రపంచకప్ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఫైనల్లో ఆ జట్టు న్యూజిలాండ్పై ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్, పాకిస్థాన్ సెమీ ఫైనల్ వరకు చేరుకున్నాయి. కాగా ఈ ప్రపంచకప్లో టీమిండియా సూపర్ 12లోనే ఇంటి దారి పట్టి తీవ్రంగా నిరశపరిచింది.