చాలా సంవత్సరాల తర్వాత పాకిస్థాన్ ఐసీసీ ఈవెంట్ నిర్వహించబోతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) అందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే పాక్ లో పర్యటించేందుకు బీసీసీఐ నిరాకరిస్తుంది. భారత ప్రభుత్వం నుంచి అక్కడి వెళ్లేందుకు అనుమతి రాకపోవడంతో పాక్ కు వెళ్లేందుకు సిద్ధంగా లేమని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) భారత్ తేల్చి చెప్పింది. దీంతో ఐసీసీ మధ్య మార్గంగా ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
ఇందుకు పాకిస్థాన్ నిరాకరిస్తూ వస్తోంది. భారత్ తమ దేశంలో పర్యటించాల్సిందేనని పట్టుబడుతుంది. భారత్ మాత్రం హైబ్రిడ్ మోడ్ లో మ్యాచ్ నిర్వహించాలని కోరుతోంది. దీనిపై ఐసీసీ పీసీబీతో చర్చలు జరుపుతోంది. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్ పాకిస్థాన్లో పర్యటించలేదు. అంతేకాదు 2009లో పాక్ లో శ్రీలంక టీమ్ బస్సుపై జరిగిన భయంకరమైన దాడి తర్వాత కొద్ది సంవత్సరాల పాటు పాక్ లో ఆడడానికి ఏ దేశం రాలేదు. ఆ తర్వాత అక్కడి క్రికెట్ బోర్డు తీసుకున్న చర్యలతో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆ దేశంలో పర్యటించాయి.

పాకిస్థాన్ 1996 ప్రపంచ కప్కు సహ-హోస్ట్ చేసింది. ఆతర్వాత పెద్ద టోర్నమెంట్లను పాకిస్థాన్ నిర్వహించలేదు. కానీ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు హక్కులు దక్కించుకుంది. గత ఏడాది భారత్ ఆసియా కప్ హైబ్రిడ్ మోడ్ లో పాకిస్థాన్ తో పాటు శ్రీలంకలో మ్యాచ్ లు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఇదే విధానంలో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. ఇందుకు సంబంధించి పీసీబీతో మాట్లాడుతుంది. ఐసీసీ ప్రతిపాదనకు పీసీబీ అంగీకరించకపోతే ఆ జట్టు ఆర్థికంగా భారీగా నష్టపోవాల్సి వస్తుందని తెలుస్తోంది.
పాక్ ఒప్పుకోకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ వేదికనే మార్చాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. హైబ్రిడ్ మోడ్ లో టోర్నమెంట్ నిర్వహిస్తే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భారీ మొత్తంలో పరిహారం ఆశిస్తున్నట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడ్ లో జరిగితే పాకిస్థాన్లో 10 మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. మరో ఐదు (అందులోనే ఒక సెమీస్, ఫైనల్) మ్యాచ్లను వేరే ప్రాంతంలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. హైబ్రిడ్ మోడ్ లో మ్యాచ్ లు నిర్వహించేందుకు ఇప్పటికే పాకిస్థాన్ ఆఫర్ ఇచ్చినట్లు ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు పాక్ ఒప్పుకుంటే ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పినట్లు వివరించాయి.