హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో క్రికెటర్లు ధరించే హెల్మెట్లకు సంబంధించి కొత్త నిబంధనలను ప్రవేశపెడుతున్నట్టు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇకపై క్రికెట్ ఆడే ఆటగాళ్లు బ్రిటీష్ స్టాండర్డ్ బీఎస్ 7928:2013 ప్రమాణాలకు అనుగుణంగా ఉండే హెల్మెట్లను మాత్రమే ధరించాలని స్పష్టం చేసింది.

ఐసీసీ దుస్తులు, పరికరాల నిబంధనల్లో దీనిని చేర్చనున్నట్టు ప్రకటనలో పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు వివరించింది. ఐసీసీ నిబంధనలకు అనుగుణంగా హెల్మెట్లను ధరించకుండా ఆటగాళ్లు రెండుసార్లు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారిక వార్నింగ్ అందుకుంటారు.
మూడోసారి కూడా ఇదే తప్పుచేస్తే ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడుతుందని ఐసీసీ జనరల్ మేనేజర్ అలార్డిస్ తెలిపారు. ఆటగాళ్ల భద్రతే తమ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ఐసీసీ ఆమోదించిన భద్రమైన హెల్మెట్లు ఆటగాళ్లు తప్పనిసరిగా ధరించాలని ఆయన సూచించారు.