
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయాలంటే ఇకనుంచి వయసు అనివార్యం అయింది. అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి కనీస వయసును ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా నిర్ధారించింది. ఇకపై కనీసం 15 ఏళ్లు నిండితేనే అంతర్జాతీయ క్రికెట్లో ఆడేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఒకవేళ 15 ఏళ్లలోపు ప్లేయర్ను ఇంటర్నేషనల్ జట్టులో ఆడించేందుకు సంబంధిత సభ్యదేశం ఐసీసీకి దరఖాస్తు చేసుకోవాలి. ఐసీసీ ఈవెంట్లు సహా ద్వైపాక్షిక క్రికెట్, అండర్ 19 క్రికెట్కు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని ఐసీసీ అధికారులు స్పష్టం చేశారు.
'ప్రతీ క్రికెట్ బోర్డు వయసు నిబంధనను అమలు చేయాల్సి ఉంది. కనీస వయసు అనేది తప్పనిసరి చేయాలి. అండర్-19 క్రికెట్లో అయినా , ద్వైపాక్షిక క్రికెట్లో అయినా, పురుషుల క్రికెట్ అయినా, మహిళల క్రికెట్లోనైనా కనీస వయసు 15 ఏళ్లు నిండి ఉండాలి' అని ఐసీసీ స్పష్టం చేసింది. ఒకవేళ తక్కువ వయసు కల్గిన ఆటగాడిలో అపారమైన ప్రతిభ ఉండి, మానసికంగా ధృఢంగా ఉన్నాడనిపిస్తే అప్పుడు సదరు బోర్డు ఐసీసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఐసీసీ తెలిపింది. ప్లేయర్స్కు రక్షణ కల్పించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ పేర్కొంది.
ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో ఆడేందుకు ఎలాంటి వయసు పరిమితి లేదు. అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన రికార్డు పాకిస్థాన్కు చెందిన హసన్ రజా పేరిట ఉంది. హసన్ రజా 14 ఏళ్ల 227 రోజుల వయసులోనే టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. పాక్ తరఫున 1996-2005 మధ్య 7 టెస్టులు, 16 వన్డేలు ఆడాడు.
భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 15 ఏళ్లు దాటాకే అంతర్జాతీయ క్రికెట్ ప్రవేశం చేశాడు. 16 ఏళ్ల 205 రోజుల వయసలో సచిన్ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. అతని అంతర్జాతీయ కెరీర్లో భాగంగా టెస్టుల్లో 15, 921 పరుగులు చేయగా, వన్డేల్లో 18, 426 పరుగులు సాధించాడు. ఈ రెండు ఫార్మాట్లలో సచిన్ 100 శతకాలను సాధించాడు. దాంతో వంద అంతర్జాతీయ శతకాలు సాధించిన తొలి ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు.