
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఎలైట్ ప్యానెల్లో భారత్ అంపైర్ నితిన్ మీనన్ను కొనసాగించింది. ఈ నెలాఖరులో శ్రీలంకలో ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక మధ్య టెస్ట్ సిరీస్కు న్యూట్రల్ అంపైర్గా తొలిసారి నితిన్ మీనన్ కనిపించబోతున్నాడు. ఇండోర్కు చెందిన 38ఏళ్ల నితిన్ మీనన్.. 11మంది సభ్యుల ఐసీసీ ఎలైట్ ప్యానల్ లిస్టులో ఏకైక భారత అంపైర్గా నిలిచాడు. ఇక ఐసీసీ నుంచి మీనన్కు ఒక సంవత్సరం పొడిగింపు లభించింది.
'గత మూడు నాలుగేళ్లుగా మా ప్రధాన అంపైర్గా ఉన్న నితిన్ మీనన్కు ఐసీసీ ఇటీవల ఒక సంవత్సరం పొడిగింపు ఇచ్చింది. అతను ఈ నెలలో న్యూట్రల్ అంపైర్గా అరంగేట్రం చేయబోతున్నాడు' అని బీసీసీఐ అధికారి ఒకరు ప్రముఖ వార్తా సంస్థతో తెలిపాడు. ఇక 2020లో కొవిడ్ టైంలో మీనన్ ఎలైట్ ప్యానెల్లో పదోన్నతి పొందాడు. ఎస్.వెంకటరాఘవన్, ఎస్.రవి తర్వాత ఎలైట్ క్లబ్లో చేరిన మూడో భారతీయుడిగా నితిన్ మీనన్ నిలిచాడు. కోవిడ్ వల్ల నితిన్ మీనన్ కేవలం భారతదేశంలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్లకు మాత్రమే అంపైర్గా వ్యవహరించాల్సి వచ్చింది. ఐసీసీ అంపైర్లకు ప్రయాణ పరిమితులు విధించడంతో ఎలైట్ లిస్ట్ అంపైర్లు ఏ దేశానికి చెందినవారైతే ఆ దేశంలో జరిగే మ్యాచ్ల్లో విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. ఇక కోవిడ్-19 ప్రభావం తగ్గడంతో ఎలైట్ లిస్టులో ఉన్న ఆస్ట్రేలియన్ పాల్ రీఫిల్ ప్రస్తుతం న్యూజిలాండ్తో ఇంగ్లాండ్ హోమ్ సిరీస్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇక నితిన్ మీనన్ సైతం శ్రీలంకకు వెళ్లనున్నాడు.
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో తన విధులను పూర్తి చేసిన తర్వాత.. నితిన్ మీనన్ జూన్ 29నుండి గాలేలో ప్రారంభమయ్యే ఆస్ట్రేలియాతో జరిగే రెండు-టెస్ట్ల సిరీస్ కోసం శ్రీలంకకు వెళ్లడానికి అతను సిద్ధమయ్యాడు. ఇక ఐసీసీ ప్రకటించి ఎలైట్ ప్యానెల్లో ఎటువంటి మార్పు లేదు. మీనన్తో పాటు ప్యానెల్లో పాకిస్థాన్కు చెందిన అలీమ్ దార్, న్యూజిలాండ్కు చెందిన క్రిస్ గఫానీ, శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన, దక్షిణాఫ్రికాకు చెందిన మరైస్ ఎరాస్మస్, మైఖేల్ గోఫ్, రిచర్డ్ ఇల్లింగ్వర్త్, రిచర్డ్ కెటిల్బరో, ఆస్ట్రేలియా నుండి పాల్ రీఫిల్, ఇంగ్లాండ్ నుంచి రాడ్ టక్కర్, వెస్టిండీస్ నుండి జోయెల్ విల్సన్ ఉన్నారు. ఐసీసీ ఎలైట్ అంపైర్ల ప్యానెల్లో ఎవరిని చేర్చాలనే దానిపై బీసీసీఐ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం అనిల్ చౌదరి, వీరేందర్ శర్మ, జె.మదనగోపాల్, కేఎన్ అనంతపద్మనాభన్ టీమిండియా దిగువ శ్రేణి అంపైర్లుగా కొనసాగుతున్నారు.