
ఇప్పటికే సౌతాఫ్రికా పర్యటనలో ఓడి తీవ్ర నిరాశలో ఉన్న టీమిండియాకు ఐసీసీ బిగ్ షాకిచ్చింది. కేప్టౌన్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్లో టీమిండియా నిదానంగా బౌలింగ్ చేసిందంటూ ఐసీసీ భారీగా ఫైన్ విధించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఐసీసీ నియావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే ఒక ఓవర్ తక్కువగా వేస్తే 20% ఫైన్ విధిస్తారు. కాగా మూడే వన్డేలో రాహుల్ సేన నిర్ణీత సమయం కంటే 2 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసింది. దీంతో టీమిండియాకు ఐసీసీ 40% ఫైన్ విధించింది. దీంతో భారత ఆటగాళ్లకు తమ మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత పడనుంది. మూడో వన్డేలో టీమిండియా నిదానంగా బౌలింగ్ చేసినందని ఆన్ ఫీల్డ్ అంపైర్లు మరైస్ ఎరాస్మస్, బొంగాని జెలే, థర్డ్ అంపైర్ అల్లాహుదీన్ పాలేకర్, నాలుగో అంపైర్ అడ్రియన్ హోల్డ్స్టాక్ ఐసీసీకి ఫిర్యాదు చేయగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా తాము నిదానంగా బౌలింగ్ చేసినట్టు అంగీకరించాడు. దీంతో ఎలాంటి విచారణ లేకుండా టీమిండియాకు ఐసీసీ ఫైన్ విధించింది.
ఇక కేప్టౌన్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్ విషయానికొస్తే చివరి వరకు పోరాడినా టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత జట్టు వన్డే సిరీస్లో వైట్ వాష్ అయింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా మరో బంతి మిగిలి ఉండగానే 287 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు ఓపెనర్ క్వింటన్ డికాక్ (124) సెంచరీతో చెలరేగాడు. డస్సెన్ (52), మిల్లర్ (39) అతనికి సహకరించారు. అనంతరం 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ చివరి వరకు పోరాడి 283 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (65), శిఖర్ ధావన్ (61), దీపక్ చాహర్ (54) రాణించారు.
కాగా వన్డే సిరీస్కు ముందు జరిగిన టెస్ట్ సిరీస్లో కూడా టీమిండియా ఓడిపోయింది. తొలి టెస్ట్ మ్యాచ్ గెలిచి మంచి జోష్ మీద కనిపించినప్పటికీ తర్వాత అదే దూకుడును కొనసాగించలేకపోయింది. ఆ తర్వాత జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ల్లోనూ ఓడి తీవ్రంగా నిరాశపరించింది. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ను 1-2తో చేజార్జుకుంది. దీంతో సౌతాఫ్రికా పర్యటనలో భారత్కు మరోసారి నిరాశ తప్పలేదు.