న్యూలాండ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించి టెస్టు
సిరీస్ను 1-1తో సమం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిచ్ విషయంలో విమర్శలు వెల్లువెత్తాయి. బ్యాటింగ్ చేయడానికి అనూకూలంగా లేదని, ప్రమాదకర పిచ్గా మాజీ క్రికెటర్లు విమర్శించారు. అంతేగాక చరిత్రలో నిలిచిపోయే పేలవమైన రికార్డులు నమోదయ్యాయి.
అత్యంత తక్కువ బంతుల్లో ఫలితం వచ్చిన టెస్టుగా ఈ మ్యాచ్ రికార్డులకెక్కెంది. కేవలం ఒకటిన్నర రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్ ఫలితం 106.2 ఓవర్లలోనే తేలింది. అంతేగాక టెస్టులో తొలి రోజు 23 వికెట్లు పడటం 122 ఏళ్లలో ఇదే తొలిసారి. 1902లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో తొలి రోజు ఏకంగా 25 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత ఇదే అత్యుత్తమం.

టీమిండియా తొలి ఇన్నింగ్స్లోనూ ఓ పేలవమైన రికార్డు నమోదైంది. 153/4తో ఉన్న భారత్.. అదే స్కోరుకు ఆలౌటై చెత్త రికార్డు నమోదు చేసింది. టెస్టు స్కోరులో ఒక్క పరుగు కూడా జత చేయకుండా ఆరు వికెట్లు కోల్పోయిన తొలి జట్టుగా నిలిచింది. అయితే విమర్శలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన న్యూలాండ్స్ పిచ్కు ఐసీసీ రేటింగ్ ఇచ్చింది. 'అసంతృప్తికర పిచ్' గా పేర్కొంది. దాంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది.
డీమెరిట్ పాయింట్లను అయిదేళ్ల వరకు ఐసీసీ పరిగణనలోకి తీసుకుంటుది. ఏదైనా వేదిక(స్టేడియం) ఆరు డీమెరిట్ పాయింట్లు పొందితే ఏడాది పాటు నిషేధాన్ని ఎదుర్కొంటుంది. అంటే 12 నెలల పాటు సదరు స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ను నిర్వహించలేరు. కాగా, పిచ్ గురించి ఇరు జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, డీన్ ఎల్గర్తో పాటు మ్యాచ్ రిఫరీ క్రిస్ బాడ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
''న్యూలాండ్స్ పిచ్పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది. మ్యాచ్ ఆద్యంతం బంతి వేగంగా, భయంకరంగా బౌన్స్ లభించింది. బ్యాటర్లు షాట్లు ఆడటం కష్టమైంది. విపరీతమైన బౌన్స్తో చాలా మంది బ్యాటర్లు బంతిని గ్లవ్స్కు తగిలించుకుని వికెట్లను చేజార్చుకున్నారు'' అని మ్యాచ్ రిఫరీ బ్రాడ్ రిపోర్ట్లో పేర్కొన్నాడు. అయితే బౌన్సీ పిచ్లు గొప్పవని, భారత్ స్పిన్ పిచ్లు మ్యాచ్కు అనుకూలం కావని పేర్కొనే SENA దేశాల మాజీలకు.. ఐసీసీ ఇచ్చిన రేటింగ్ చెంపపెట్టులాంటిదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.