
హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా ఆప్ఘనిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో ముష్ఫికర్ రహీమ్ 87 బంతుల్లో 83(4 ఫోర్లు, ఒక సిక్స్), షకీబ్ ఉల్ హాసన్ 69 బంతుల్లో 51(ఒక ఫోర్) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. దీంతో ఆప్ఘనిస్థాన్కు 263 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆప్ఘన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ మూడు వికెట్లు తీయగా... నైబ్ రెండు.. జద్రాన్, నబీ తలో వికెట్ తీసుకున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ ఉల్ హాసన్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచకప్లో వెయ్యి పరుగులు సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. లీగ్ దశలో రెండు సెంచరీలు సాధించి, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన జట్టుకు షకీబ్ ఉల్ హాసన్ హాఫ్ సెంచరీతో అండగా నిలిచాడు.
బంగ్లా ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ప్రపంచకప్లో వెయ్యి పరుగులు సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా ఈ రికార్డు సాధించిన 19వ ఆటగాడిగా షకీబ్ నిలిచాడు. షకీబ్కు ముందు 5 శ్రీలంక క్రికెటర్లు, 3 ఆస్ట్రేలియన్లు, 3 వెస్టిండిస్ క్రికెటర్లు, 3 సఫారీ క్రికెటర్లు, 2 భారత క్రికెటర్లు, ఒక పాకిస్థానీ క్రికెటర్, ఒక న్యూజిలాండ్ క్రికెటర్ ఈ ఘనత సాధించారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాకు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ లిటాన్ దాస్(16) తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షకీబ్తో కలిసి తమీమ్ ఇక్బాల్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీరిద్దరూ 59 పరుగులు జోడించిన తర్వాత జట్టు స్కోరు 82 పరుగుల వద్ద తమీమ్(36) ఔటయ్యాడు.
ఆ తర్వాత షకీబ్-ముష్ఫికర్ రహీంల జోడీ నిలకడగా ఆడి స్కోరు బోర్డుని నడిపించారు. ఈ క్రమంలో జట్టు స్కోరు 143 పరుగుల వద్ద షకీబ్ హాఫ్ సెంచరీ అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే సౌమ్య సర్కార్(3) కూడా ఔట్ కావడంతో బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది.
ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ముష్పికర్ రహీమ్ బాధ్యతాయుతంగా ఆడి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. చివర్లో మహ్మదుల్లా(27), మొసదెక్ హుస్సేన్(35) ఫరవాలేదనిపించడంతో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది.