సిడ్నీ: భారత్ క్రికెట్ అభిమానులు అనుకున్నదే అయింది. క్వార్టర్ ఫైనల్స్లో బంగ్లాదేశ్పై భారత్ అలవోక విజయం సాధించింది. ఇక అందరికళ్లు సెమీస్ పైనే. సెమీస్లో భారత్ ఆస్టేలియాతో ఆడుతుందా లేదా పాకిస్ధాన్ తోనా అనేది ఇప్పుడు క్రికెట్ అభిమానుల ముందున్న అతి పెద్ద ప్రశ్న.
వరల్డ్ కప్లో భాగంగా మార్చి 20 (శుక్రవారం) జరిగే మూడో క్వార్టర్ ఫైనల్స్లో ఆస్టేలియా, పాకిస్ధాన్ జట్లు అడిలైడ్ మైదానంలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో విజేత ఎవరైతే వారితో సెమీస్లో టీమిండియా ఆడుతుంది. ఆస్టేలియా Vs పాకిస్ధాన్ మ్యాచ్లో యావత్ ప్రపంచం మొత్తం పాకిస్ధాన్ గెలవాలని కోరుకుంటుంది. అందుకు కారణం దాయాది దేశాల మధ్య మ్యాచ్ ఎప్పుడూ ఆసక్తికరమే.
వరల్డ్ కప్లో పాకిస్ధాన్పై టీమిండియాకు మెరుగైన రికార్డు ఉంది. ఇక ఆస్టేలియాలో జరుగుతున్న ఈ వరల్డ్ కప్లో ఆస్టేలియా పటిష్టమైన జట్టు అయినప్పటికీ, టీమిండియా విజయాల జైత్రయాత్ర చేస్తుండటంతో ఆసీస్ను ధోని సేన ఎదుర్కొనడం ఏమంత కష్టం కాదు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో ఆస్టేలియాలో కేవలం ఒక్క మ్యాచ్లోనే ఓడింది.

నాలుగు లీగ్ మ్యాచ్ల్లో గెలవగా, బంగ్లాదేశ్తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఇక పాకిస్ధాన్ విషయానికి వస్తే తొలి రెండు లీగ్ మ్యాచ్ల్లో ఓటమిని చవిచూసినా, ఆ తర్వాత మ్యాచ్ల్లో అనూహ్యంగా పుంచుకొని క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. ఒకానొక దశలో పాకిస్ధాన్కు నాకౌట్ అవకాశమే క్లిష్టంగా మారింది. ఆరు లీగ్ మ్యాచ్ల్లో నాల్గింటిలో గెలిచింది. గెలిచిన నాలుగు మ్యాచ్ల్లో అగ్రశ్రేణి జట్టు ఒక దక్షిణాఫ్రికానే, మిగిలిన మూడు జట్లు పసికూనలు.

శుక్రవారం జరగనున్న మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా టీమిండియా సెమీస్లో కాస్తంత కష్టపడితే ఫైనల్కు చేరడం ఏమంత కష్టం కాదు. ఇప్పటి వరకు సాగిన వరల్డ్ కప్లో ధోని ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతూ, విజయాల పరంపరను కొనసాగించింది.
డిఫెండింగ్ ఛాంపియన్గా ఈ వరల్డ్ కప్లో బరిలోకి దిగిన టీమిండియా సెమీస్లో కూడా గెలిచి మళ్లీ ఫైనల్కు అర్హత సాధించాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే జరగాలని వన్ఇండియా కూడా కోరుకుంటుంది.