హైదరాబాద్: ఐసీసీ వరల్డ్కప్ టోర్నీలో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటలకు ఆప్ఘనిస్థాన్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో స్మిత్, వార్నర్ మైదానంలోనికి దిగినప్పుడు వారిని గేలి చేయొద్దంటూ క్రికెట్ అభిమానులకు ఆస్ట్రేలియా జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ సూచించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
బాల్ టాంపరింగ్ ఉదంతం కారణంగా ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన వీరిద్దరూ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేశారు. వరల్డ్ కప్కు ముందు ఐపీఎల్లో ఆడిన ఇద్దరూ మళ్లీ ఫామ్ను అందుకున్నారు. ఆసీస్ తరుపున వార్మప్ మ్యాచ్ల్లో సైతం రాణించారు.
టోర్నీకి ముందు హాంప్షైర్ వేదికగా శ్రీలంకతో జరిగిన వార్మప్ మ్యాచ్లో అక్కడి అభిమానులు స్మిత్, వార్నర్లను గేలి చేస్తూ మాట్లాడారు. ఈ వార్మప్ మ్యాచ్లో స్టీవ్ స్మిత్ 50 పరుగులు చేసినప్పుడు గేలి చేసిన అభిమానులు... ఆ తర్వాత సెంచరీ వద్ద మరోసారి 'చీట్' అంటూ సంబోధించిన సంగతి తెలిసిందే.
ఈ మెగా టోర్నీలో డిపెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగుతోన్న ఆస్ట్రేలియా శనివారం బ్రిస్టల్ వేదికగా ఆప్ఘనిస్థాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ "స్మిత్, వార్నర్ పెద్ద తప్పు చేశారు. దానికి మూల్యం కూడా చెల్లించుకున్నారు" అని అన్నాడు.
"గౌరవం దక్కించుకోవాలని మీడియా మాట్లాడుతోంది. కానీ గౌరవం ఇవ్వడం కూడా ముఖ్యమన్న విషయాన్ని అభిమానులు గ్రహించాలి. కాబట్టి వారు మైదానంలో అడుగుపెట్టేటప్పుడు కనీస మర్యాద పాటిస్తే మంచిది. వారిని ఎగతాళి చేయకూడదు. వీరినే కాదు, దానంలోకి దిగుతున్నపుడు ఏ దేశానికి చెందిన ఆటగాడినైనా గేలి చేయడం మంచిది కాదు" అని తెలిపాడు.