
పరిమిత ఓవర్ల ఆటలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గొప్ప ఆటగాడు. నాకన్నా బాగా ఆడగలడు అని ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్లో పంత్ భారత్ తరపున ఆడే అవకాశాలు ఉన్నాయని రిటైర్మెంట్ రోజున (జూన్ 10) యువీ అన్నాడు. యువీ అన్న మరుసటి రోజే స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ధావన్కు బ్యాకప్గా పంత్ ఇంగ్లండ్ వెళ్లాడు. ఇక ధావన్ ఎడమ చేతి బొటనవేలుకు తీవ్ర గాయం కావడంతో టోర్నీ మొత్తానికి దూరమైన నేపథ్యంలో అధికారికంగా పంత్ భారత ప్రపంచకప్ జట్టులో చేరాడు. అనంతరం యువీ మాట్లాడుతూ... 'ప్రపంచకప్ జట్టులో పంత్ భాగమయ్యాడు. పంత్ గొప్ప ఆటగాడు. పరిమిత ఓవర్ల ఆటలో మంచి ప్రదర్శన చేయగలడు. అతి తక్కువ కాలంలోనే పంత్ సత్తా నిరూపించుకున్నాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో రెండు సెంచరీలు కూడా చేసాడు. పంత్ నాకన్నా బాగా ఆడగలడు. రాబోయే కాలంలో జట్టులో కొనసాగాలని కోరుకుంటున్నా' అని యువీ పేర్కొన్నారు.
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ రిషబ్ పంత్కు ఇది సరైన అవకాశమని చెప్పుకొచ్చాడు. 'నిన్ను నువ్వు నిరూపించుకునేందుకు ఇంతకన్నా పెద్ద అవకాశం మరొకటి ఉండదు' అని సచిన్ తెలిపాడు. జట్టులోకి ఎంపికయినా.. నాలుగో స్థానంలో పంత్ ఆడుతాడో లేదో స్పష్టంగా తెలియదు. ఆల్రౌండర్ విజయ్శంకర్, రిషబ్ పంత్, దినేశ్ కార్తిక్లు ఈ స్థానం కోసం పోటీపడుతున్నారు. ప్రపంచకప్లో భాగంగా టీమిండియా శనివారం ఆప్ఘనిస్థాన్తో తలపడనుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్లు నెగ్గి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.