ఆదుకున్న ముష్ఫికర్:
360 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాకు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు లిటన్ దాస్ (73), సౌమ్య సర్కార్ (25)లు ఇన్నింగ్స్ను నడిపించారు. భారత పేసర్లు బుమ్రా, షమీలను సమర్థంగా ఎదుర్కొంటూ 49 పరుగులు జోడించారు. బుమ్రా వేసిన పదో ఓవర్లో కార్తీక్కు క్యాచ్ ఇచ్చి సౌమ్య ఔటయ్యాడు. ఆ తర్వాతి బంతికే షకీబ్ (0) పెవిలియన్ చేరాడు. ఈ దశలో లిటన్.. ముష్ఫికర్ (90)తో కలిసి బ్యాటింగ్ చేసాడు. ఈ జోడి 130 బంతుల్లో 120 పరుగులు జత చేశారు.
95 పరుగులకే 8 వికెట్లు:
స్పిన్నర్ చహల్ వరుస బంతుల్లో లిటన్, మిథున్ (0)లను పెవిలియన్ చేర్చాడు. తొలుత మొహ్మదుల్లా (9)ను బౌల్డ్ చేసిన కుల్దీప్.. ముష్ఫికర్, హొస్సేన్ (0)లను అవుట్ చేసాడు. హాసన్ కూడా రనౌట్ అవ్వడంతో.. బంగ్లాదేశ్ 49.3 ఓవర్లలో 264 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా 95 పరుగులకే చివరి ఎనిమిది వికెట్లు చేజార్చుకుంది. కుల్దీప్, చాహల్ తలో మూడు వికెట్లు తీశారు.
ఓపెనర్లు విఫలం:
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్లకు 359 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ (19), ధావన్ (1) మరోసారి నిరాశపరిచారు. కోహ్లీ (47; 46 బంతుల్లో 5×4) రాహుల్తో మూడో వికెట్కు 33 పరుగులు జోడించి నిష్క్రమించాడు. కాసేపటికే విజయ్ శంకర్ (2) కూడా ఔటవడంతో భారత్ 22 ఓవర్లలో 102/4తో కష్టాల్లో పడింది. అయితే నాలుగో స్థానంలో వచ్చిన రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
శతకాల జోరు:
మొదటగా నెమ్మదిగా ఆడిన ధోనీ.. గేర్ మార్చి క్రమంగా చెలరేగిపోయాడు. బౌండరీలతో అలరించాడు. ఈ జోడి దాటికి టీమిండియా స్కోర్ 250 దాటింది. 94 బంతుల్లో శతకం (108; 99 బంతుల్లో 12×4, 4×6) పూర్తి చేసుకున్న రాహుల్.. కాసేపటికే అవుట్ అయ్యాడు. ఈ దశలో ధోనీ మరింత విధ్వంసం సృష్టించాడు. జయేద్ బౌలింగ్లో సిక్స్ బాది శతకం పూర్తి చేశాడు. ధాటిగా ఆడే క్రమంలో ఆఖరి ఓవర్లో ధోనీ (113; 78 బంతుల్లో 8×4, 7×6) ఔటయ్యాడు. భారత్ చివరి 6 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది.