
హైదరాబాద్: 2019 వన్డే ప్రపంచకప్ కోసం ఐసీసీ ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్కు ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో వరల్డ్కప్ పోటీలకు ఇంకా 8 నెలలు కూడా సమయం లేకపోవడంతో ఐసీసీ వినూత్నంగా ప్రచారం చేస్తోంది.
ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి జులై 14 వరకు ఈ వరల్డ్కప్ జరగనుంది. ఈ వరల్డ్కప్ కోసం లండన్ వ్యాప్తంగా పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తాజాగా 'పుట్టింటికి క్రికెట్ తిరిగొస్తోంది' అని ట్యాగ్లైన్తో ఐసీసీ ఓ ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇదే క్యాప్షన్తో విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
సొంతగడ్డపై జరుగనున్న వరల్డ్ కప్ కావడంతో ఇంగ్లాండ్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టు విశ్వవిజేతగా నిలవాలని కలలు కంటోంది. క్రికెట్కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ ఖాతాలో ఇప్పటివరకు ఒక్క వన్డే వరల్డ్ కప్ లేకపోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది.
దీంతో ఇంగ్లీష్ జట్టు వరల్డ్ చాంపియన్గా నిలవడం ఖాయమని ఇంగ్లండ్లో క్రికెట్ ఫ్యాన్స్ ధీమాగా చెప్పుకుంటున్నారు. ఐసీసీ విడుదల చేసిన తాజా ప్రమోషనల్ వీడియో క్రికెట్ అభిమానులను అలరిస్తోంది. 'పుట్టింటికి క్రికెట్ తిరిగొస్తోంది' అనే ట్యాగ్ లైన్ ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అంచనాలను ఇది మరింతగా పెంచుతోంది.