
సెమీస్ లేదా ఫైనల్..
ధోనీ ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా కొనసాగుతున్న ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆడుతున్నారు. భారత క్రికెట్ జట్టు సెమీఫైనల్కు అర్హత సంపాదించింది. లీగ్ దశలో బంగ్లాదేశ్ను ఓడించి, సెమీ ఫైనల్లో బెర్త్ను ఖరారు చేసుకుంది. ఇక ఫైనల్ మ్యాచ్ ఆడుతుందా? లేదా? అనేది తేలడానికి ఇంకా సమయం ఉంది. దురదృష్టవశావత్తూ భారత జట్టు సెమీ ఫైనల్ దశలోనే తిరుగు ముఖం పట్టినా.. అదే ధోనీకి చివరి మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదా- కోహ్లీసేన ఫైనల్కు చేరినా, ఆ తరువాత ధోనీ మరో మ్యాచ్లో ఇక కనిపించకపోవచ్చు.

విండీస్తో సిరీస్ నాటికి..
ప్రపంచకప్ టోర్నమెంట్ ముగిసిన తరువాత భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరి వెళ్తుంది. అమెరికాలోని ఫ్లోరిడా సహా కరేబియన్ దీవుల్లోని గయానా, ట్రినిడాడ్, అంటిగ్వా, జమైకాలల్లో ఈ సిరీస్ను నిర్వహించబోతోంది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇదివరకే ఖరారైన విషయం తెలిసిందే. ఈ సిరీస్కు మహేంద్ర సింగ్ ధోనీ అందుబాటులో ఉండకపోవచ్చని అంటున్నారు. ఈ సిరీస్ నాటికే ఆయన క్రికెట్కు వీడ్కోలు చెప్పే అవకాశాలు లేకపోలేదని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. అదే నిజమైతే- క్రికెట్ అభిమానులు.. ఓ గొప్ప ఆటగాడి ప్రదర్శనకు ఇక నోచుకోనట్లే. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మాత్రం ధోనీ యథాతథంగా కొనసాగుతారని చెబుతున్నారు.

ధోని బ్యాటింగ్పై విమర్శలు..
ప్రపంచకప్ టోర్నమెంట్ మ్యాచుల్లో ధోనీ బ్యాటింగ్ శైలిపై విమర్శలు చెలరేగుతున్నాయి. సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ మంజ్రేకర్ వంటి మాజీ బ్యాట్స్మెన్లు ప్లస్ కామెంటేటర్లు ధోనీ బ్యాటింగ్ను తప్పు పడుతున్నారు. మిడిలార్డర్లో అత్యంత మందకొడిగా ధోనీ ఆడుతున్నాడని, అతని సహజ సిద్ధమైన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేస్తున్నాడంటూ ఆరోపిస్తున్నారు. ఇంగ్లండ్తో మ్యాచ్ సందర్భంగా చాలామంది నెటిజన్లు, ట్విట్టరెట్టీలు ధోనీ బ్యాటింగ్ను అడ్డుకుని ఆయనను ట్రోల్ చేశారు. లక్ష్యం భారీగా ఉన్నప్పటికీ.. ధోనీ ఇంగ్లండ్తో మ్యాచ్లో తీరిగ్గా బ్యాటింగ్ చేశాడని ఎద్దేవా చేశారు. వాటి సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ధోనీ ఓ మంచి ఫినిషర్గా, ఓ గొప్ప క్రికెటర్గా చరిత్రలో నిలిచిపోతారని అంటున్నారు.


Click it and Unblock the Notifications












