మెగా టోర్నీ ప్రపంచకప్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్ల సమావేశాన్ని భారత మీడియా బహిష్కరించింది. ఈ ఘటనతో టీమిండియా, భారత మీడియా మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్లో అడుగుపెట్టినప్పటినుండి టీమిండియా భారత మీడియాకు దూరంగానే ఉంది. 2015 ప్రపంచకప్లో కూడా కెప్టెన్ ఎంఎస్ ధోనీ మ్యాచ్ ముగిసిన తర్వాత మాత్రమే మీడియా సమావేశానికి వచ్చేవాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇతర భారత ఆటగాళ్లు ఎవరూ కూడా మీడియాతో మాట్లాడలేదు. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో భారత ఆటగాళ్లు మాట్లాడకుండా మీడియాను ఎందుకు దూరంగా పెడుతున్నారని పాత్రికేయులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో నెట్ బౌలర్లు దీపక్ చాహర్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్తో టీమిండియా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశాన్ని భారత మీడియా బహిష్కరించింది.
ప్రపంచకప్లో భాగంగా బుధవారం టీమిండియా తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఢీ కొట్టనుంది. దీంతో కోచ్ లేదా కెప్టెన్ మీడియాతో మాట్లాడతారని పాత్రికేయులు ఆశించారు. ఎవరూ ఊహించని విధంగా నెట్ బౌలర్లు సమావేశానికి వెళ్తున్నారని జట్టు మేనేజర్ పాత్రికేయులకు తెలపడంతో వారు సమావేశాన్ని నిరాకరించారు. బంగ్లాదేశ్, పాక్ మీడియాకు ఆ దేశ ఆటగాళ్లు సహకరిస్తున్నపుడు టీమిండియాకు మాత్రం అభ్యంతరం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.