
హైదరాబాద్: ప్రపంచకప్లో సెమీస్కు ముందు ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మణికట్టు గాయం కారణంగా ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాట్స్మన్ షాన్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. కాగా, ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్కు చేరింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
టోర్నీలో భాగంగా తన చివరి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో తలపడనున్న సంగతి తెలిసిందే. శనివారం జరిగే ఈ మ్యాచ్ కోసం ఓల్డ్ ట్రఫార్డ్లో నెట్ ప్రాక్టీస్లో పాల్గొన్న షాన్ మార్ష్ గాయపడ్డాడు. పాట్ కమిన్స్ బంతులను ఎదుర్కొనే క్రమంలో అతడి మణికట్టుకు తీవ్ర గాయమైంది.
దీంతో అతడికి సర్జరీ చేయాల్సి రావడంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో షాన్మార్ష్ స్థానంలో పీటర్ హ్యాండ్స్కోంబ్ ప్రపంచకప్ తుది జట్టుతో చేరతాడని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. "ప్రపంచకప్లో గాయపడిన షాన్ మార్ష్ స్థానాన్ని పీటర్ హ్యాండ్స్కోంబ్తో భర్తీ చేసేందుకు, ఆస్ట్రేలియా తదుపరి మ్యాచ్లలో ఆడే విషయాన్ని ఐసీసీ ధ్రువీకరించింది" అని ఓ ప్రకటన విడుదల చేసింది.
కాగా, ఆల్రౌండర్ మ్యాక్స్వెల్ కుడి ముంజేతికి కూడా గాయమైంది. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో మ్యాక్స్వెల్ గాయపడ్డాడు. అయితే శనివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్కు మ్యాక్స్వెల్ అందుబాటులోకి వస్తాడని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
షాన్మార్ష్ స్థానంలో హ్యాండ్స్కోంబ్ను ఎంపిక చేయడంపై లాంగర్ మాట్లాడుతూ "పీటర్పై నమ్మకం ఉంది. మిడిల్ ఆర్డర్లో రాణించగలడనే భావిస్తున్నాం. ఇండియా, యూఏఈ టూర్లలో అతడు గొప్ప ప్రదర్శన కనబరిచాడు" అని తెలిపాడు. హ్యాండ్స్కోంబ్ ఆసీస్ తరఫున ఇప్పటివరకు 21 వన్డే మ్యాచ్లు ఆడాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.