
దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్లు డేల్ స్టెయిన్, కాగిసో రబడలపై క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) ప్రత్యేక దృష్టి పెట్టింది. దక్షిణాఫ్రికా జట్టులో ప్రధాన బౌలర్లు అవ్వడంతో ప్రపంచకప్ వరకు ఇద్దరూ కోలుకునే విధంగా సౌతాఫ్రికా యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఈ ఇద్దరు గాయపడిన విషయం తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతూ రబడ.. రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతూ డేల్ స్టెయిన్ గాయాల భారిన పడ్డారు. మే 30న ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తగిన విశ్రాంతి అవసరమని భావించిన దక్షిణాఫ్రికా బోర్డు.. వారిని వెంటనే స్వదేశానికి వచ్చేయాలని సూచించింది. బోర్డు ఆదేశాల మేరకు ఇద్దరు స్వదేశానికి వెళ్లారు. తాజాగా దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ ఒట్టిస్ గిబ్సన్ గాయాలపై స్పందించారు.
'డేల్ స్టెయిన్, కాగిసో రబడలకు కొద్దిగా సమస్య ఉంది. కానీ ఇద్దరూ ప్రపంచకప్ వరకు కోలుకుంటారు. అభిమానులు వారి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రపంచకప్కు ఇంకా సమయం ఉంది. అప్పటివరకు వారు పూర్తిగా కోలుకుంటారు. ప్రపంచకప్లో నిరూపించుకుంటారు' అని గిబ్సన్ పేర్కొన్నారు.
ఇంతకుముందు దక్షిణాఫ్రికా జట్టు డాక్టర్ మొహమ్మద్ మూసాజీ.. రబడ గాయంపై స్పందించారు. 'కాగిసో రబడపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాం. అతడు బ్యాక్ ఇంజురీతో బాధపడుతున్నాడు. జట్టులో ప్రధాన బౌలర్ అవడంతో క్రికెట్ సౌతాఫ్రికా అతను త్వరగా కోలుకునే విధంగా చర్యలు తీసుకొంటోంది. రెండు మూడు వారాల్లో కోలుకునే అవకాశం ఉంది. ప్రపంచకప్ వరకు రబడ పూర్తిగా కోలుకుంటాడు. జట్టులో ఆడతాడు' అని మూసాజీ ఆశాభావం వ్యక్తం చేసారు.