తీవ్ర విమర్శలు:
316 పరుగుల తేడాతో విజయం సాధించడం అసాధ్యం. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ నుంచి పాక్ నిష్క్రమించడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. టీమిండియాపై ఓడిపోయాక పాక్ ఆటగాళ్లపై ఆ దేశ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక మాజీలు కూడా విరుచకుపడ్డారు. దాదాపు సెమీస్ ఆశలు గల్లంతవ్వడంతో.. ఈ విమర్శలు మరింత ఎక్కువ అయ్యాయి.
చెత్త ప్రదర్శన ఏమీ కాదు:
ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ మాత్రం పాక్ ఆటగాళ్లకు మద్దతుగా నిలిచాడు. తాజాగా మొయిన్ ఖాన్ మాట్లాడుతూ... '1992 ప్రపంచకప్ ఫలితాన్ని రిపీట్ చేస్తుందని భావించాం. కానీ సెమీస్కు వెళ్లకుండానే వెనుదిరగడం నిరాశ కలిగించేదే. ఈ ప్రపంచకప్లో పాక్ బాగానే ఆడింది. బంగ్లాపై విజయం సాధిస్తే ఐదు విజయాలు అవుతాయి. ఒక మ్యాచ్ రద్దయింది. ఇది మరీ అంత చెత్త ప్రదర్శన ఏమీ కాదు. పాకిస్తాన్ ప్రదర్శన సంతృప్తికరంగానే ఉంది. పాక్ ఆటగాళ్లను నిదించాల్సిన అవసరం లేదు. ఆటగాళ్లను మార్చాలని అంటున్నారు. కానీ ఆటగాళ్లను, బాధ్యతలను మార్చినంత మాత్రాన ప్రదర్శన మారదు' అని మొయిన్ ఖాన్ పేర్కొన్నాడు.
వారిని మార్చడం సరికాదు:
'ఇటీవల కాలం వరకు ఆస్ట్రేలియా కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ప్రపంచకప్లో టీమిండియాపై ఆస్ట్రేలియా ఓడిపోయినా.. తిరిగి పుంజుకొని పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానానికి చేరుకుంది. కానీ పాక్ మాత్రం అలా చేయలేకపోయంది. ఆటగాళ్లను, బాధ్యతలను మార్చడం సరికాదు. ప్రస్తుతం పాక్ జట్టులో ఆటపై మక్కువ, ప్రణాళిక, జవాబుదారీతనం అవసరం' అని మాజీ టెస్ట్ బ్యాట్స్మన్ బాసిత్ అలీ అన్నారు.
పాక్ ప్రదర్శనపై కమిటీ:
ప్రపంచకప్లో పాక్ జట్టు చెత్త ప్రదర్శనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఓ కమిటీని ఏర్పాటు చేసింది. గత మూడేళ్లుగా పాక్ ప్రదర్శనపై నివేదిక సమర్పించాలని కోరింది. అంతేకాకుండా భవిష్యత్ ప్రణాళికలపై సలహాలు ఇవ్వాలని కమిటీని కోరింది. మరోవైపు కెప్టెన్సీ బాధ్యతల నుంచి సర్ఫరాజ్ను తప్పించాలని పెద్ద మొత్తంలో వాదనలు వినిపిస్తున్నాయి. ప్రపంచకప్ అనంతరం ఏం జరుగుతుందో చూడాలి.