ప్రపంచకప్-2019లో చోటు దక్కని పాకిస్థాన్ పేసర్ జునైద్ ఖాన్ ట్వీట్ ద్వారా వినూత్న నిరసన తెలిపాడు. ఈ నిరసనపై పాక్ బోర్డు సీరియస్ అవ్వడంతో ఆ ట్వీట్ను జునైద్ డిలీట్ చేశాడు. ఏప్రిల్ 23లోపే అన్ని దేశాలు తమ ప్రిలిమినరీ జట్లను ప్రకటించాయి. అయితే ఏవైనా మార్పులు ఉంటే ఈ నెల 23లోపు చేసుకుని తుది జట్లను ప్రకటించాలి. ఈ నేపథ్యంలో సోమవారం పాకిస్థాన్ చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్ ప్రపంచకప్ తుది జట్టును ప్రకటించాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో విఫలమయిన ఆటగాళ్లను పాకిస్తాన్ ప్రపంచకప్ జట్టు నుంచి సెలక్టర్లు తప్పించారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
పేస్ ఆల్రౌండర్ ఫహీమ్ ఆష్రఫ్, పేసర్ జునైద్ ఖాన్, ఓపెనర్ అబిద్ అలీకి సెలక్షన్ కమిటీ మొండిచేయి చూపింది. వీరి స్థానాల్లో అసీఫ్ అలీ, వహాబ్ రియాజ్, మహ్మద్ అమీర్లకు జట్టులో చోటు కల్పించారు. అయితే ఏప్రిల్ 18వ తేదీన పాక్ ప్రకటించిన ప్రిలిమినరీ ప్రపంచకప్ జట్టులో జునైద్ చోటు దక్కించుకోగా.. ఇంగ్లండ్పై పేలవ ప్రదర్శనతో సోమవారం ప్రకటించిన తుది జట్టులో చోటు కోల్పోయాడు.
ఈ నేపథ్యంలో జునైద్ వినూత్నంగా నిరసన తెలిపాడు. నోటికి బ్లాక్ ప్లాస్టర్ అంటించుకుని ఉన్న ఓ ఫొటోను తన ట్విట్టర్లో షేర్ చేసాడు. 'చెప్పడానికేమీ లేదు. ఎందుకంటే నిజం ఎప్పుడూ చేదుగా ఉంటుంది' అని రాసుకొచ్చాడు. ఈ విషయం పాక్ బోర్డుకు తెలియడంతో సీరియస్ అయింది. పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన జునైద్ ఆ ట్వీట్ను డిలీట్ చేశాడు.