హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న వన్డే వరల్డ్కప్ ఆరంభ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం రాత్రి 9:30 గంటలకు సెంట్రల్ లండన్లోని మాల్ రోడ్లో ఈ ప్రారంభ వేడుకలు అధికారికంగా ప్రారంభయ్యాయి. ఈ వేడుకల కోసం అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
ఈ వేడుకకు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటోఫ్, కమేడియన్ పాడీ మెక్గిన్నిస్ హోస్ట్లుగా వ్యవహరిస్తున్నారు. డ్రమ్, బాస్ బ్యాండ్ రుడిమెంటర్ ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఈ వరల్డ్కప్ ప్రారంభ వేడుకల కోసం రాజకుటుంబం నుంచి పెద్ద ఎత్తున అతిథులు వస్తున్నారు. క్వీన్ ఎలిజిబెత్ II ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రారంభ వేడుకల కార్యక్రమం సుమారు గంటసేపు జరగనుంది. క్రికెట్, సంగీతం కలబోతగా భారీ ఎత్తున వినోదాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా నాలుగు వేల మంది వీక్షించనున్నారు. వీరందరికి బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎంపిక చేసి ఉచితంగా టికెట్లను అందజేశారు. ఈ ప్రారంభ వేడుకలను అటు ఐసీసీతో పాటు వరల్డ్కప్కు ఆతిథ్యమిస్తోన్న ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డులు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
వరల్డ్కప్లో పాల్గొనే 10 జట్లకు చెందిన ఆటగాళ్లు ఈ వేడుకలకు హాజరు కావడం లేదు. ఈ టోర్నీలో పాల్గొనే ప్రతి దేశం నుంచి ఓ క్రికెట్ లెజెండ్తో పాటు ఓ సెలబ్రిటీ హాజరవుతున్నారు. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు నుంచి కెవిన్ పీటర్సన్తో పాటు క్రిస్ హ్యూస్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వెస్టిండిస్ మాజీ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ఈ వేడుకలకు హాజరయ్యారు.
Look who's arrived at the #CWC19 Opening Party 👀 pic.twitter.com/QJAoUEWVfl
— Cricket World Cup (@cricketworldcup) May 29, 2019
ఈ ప్రారంభ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా అనేక ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయి. భారత్లో ఈ ప్రారంభ వేడుకలను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో చూడొచ్చు. ఇక, ఆన్లైన్లో హాట్స్టార్. కామ్ వీక్షించొచ్చు. టోర్నీలో భాగంగా ఆరంభ మ్యాచ్లో ఆతథ్య ఇంగ్లాండ్.. దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్కి లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం వేదిక కానుంది.
గురువారం నుంచి ఆరంభం కానున్న వన్డే వరల్డ్ కప్లో మొత్తం 46 రోజుల పాటు జరగనుంది. వన్డే వరల్డ్కప్కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999). సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్కప్కు ఇంగ్లాండ్ వేదికగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం.
ఈ 12వ ఎడిషన్ వరల్డ్కప్ ప్రారంభోత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఐసీసీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్లు జరగనున్నాయి. జులై 14న జరిగే వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.
The fans are readying themselves for the start of the #CWC19 Opening Party! pic.twitter.com/cQ8gOYAYXb
— Cricket World Cup (@cricketworldcup) May 29, 2019
అయితే, మే30 నుంచి ఆరంభమయ్యే 12వ ఎడిషన్ వరల్డ్కప్ను మాత్రం రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. 1992 వరల్డ్కప్ను ఈ విధంగానే నిర్వహించారు. ఫలితంగా ప్రతి జట్టు 9 మ్యాచ్లు చొప్పున ఆడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి.