ఇప్పటికే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసిన భారత అభిమానులు ఫైనల్ మ్యాచ్ చూసే ఆసక్తి లేకపోతే వాటిని తిరిగి అమ్మాలని న్యూజిలాండ్ ఆల్రౌండర్ జిమ్మీ నీషమ్ ట్విటర్ వేదికగా కోరాడు. లార్డ్స్ మైదానంలో ఆదివారం ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో జిమ్మీ నీషమ్ తన ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ప్రపంచకప్ ఆరంభానికి ముందు భారత్, ఇంగ్లాండ్ ఫేవరేట్ జట్లుగా టోర్నీలో అడుగుపెట్టాయి. భారత జట్టు కప్ కొట్టే అవకాశాలు మెండుగా ఉండడంతో మెగా టోర్నీకి కొన్నినెలల ముందే భారత అభిమానులు లీగ్తో పాటు సెమీస్, ఫైనల్ మ్యాచ్ల టికెట్లను భారీ సంఖ్యలో కొనుగోలు చేశారు. అయితే ఇంగ్లండ్ అంచనాలను అందుకుని ఫైనల్ చేరగా.. సెమీస్ ఓటమితో టోర్నీ నుంచి భారత్ నిష్క్రమించింది. దీంతో గతంలో భారత అభిమానులు కొనుగోలు చేసిన టికెట్లను ఆసక్తిగల వారికి విక్రయించాలని జిమ్మీ నీషమ్ కోరాడు.
'ప్రియమైన భారత అభిమానులారా. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ను వీరు వీక్షించేందుకు స్టేడియానికి రాలేకపోతే.. దయచేసి మీ వద్ద ఉన్న మ్యాచ్ టికెట్లను అధికారిక ప్లాట్ఫామ్ల ద్వారా విక్రయించండి. అధిక లాభానికి అమ్ముకోవాలని అందరికీ అనిపిస్తుంది. కానీ.. ధనవంతులే కాకుండా నిజమైన క్రికెట్ అభిమానులు మ్యాచ్కు వచ్చేలా చేయండి' అని నీషమ్ ట్విట్టర్ ఖాతాలో రాసుకోచ్చాడు.
ఫైనల్ మ్యాచ్కు కుమార ధర్మసేన (శ్రీలంక)నే అంపైర్గా ఎంపికయ్యారు. మారిస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా)తో కలిసి అతను ఫీల్డ్ అంపైర్గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. గురువారం ఎడ్జ్బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్లో కుమార ధర్మసేన ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ను ఔట్గా ప్రకటించిన తీరు వివాదాస్పదమైంది. ఇక కీలక ఫైనల్ మ్యాచ్కు కూడా కుమార ధర్మసేననే అంపైర్గా నియమించడం పట్ల ఐసీసీపై సామాజిక మాధ్యమాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.