27 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై ఇంగ్లండ్ ప్రపంచకప్ ఫైనల్ చేరడంతో ఆ దేశ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. అయితే అభిమానులకు ఆ దేశ క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రఖ్యాత లార్డ్స్లో ఆదివారం జరిగే ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ను యూకే అంతటా ఉచితంగా ప్రసారం చేయనున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఇంగ్లండ్ ఫైనల్లోకి ప్రవేశిస్తే ఆ మ్యాచ్ను ఫ్రీ టు ఎయిర్గా ప్రసారం చేస్తామని స్కై స్పోర్ట్స్ ఛానల్ సెమీస్ మ్యాచ్కు ముందు ప్రకటించింది. అయితే ఇంగ్లండ్ ఫైనల్లో ప్రవేశించిడంతో.. ఫైనల్ మ్యాచ్ను స్కై ఛానల్ ఫ్రీ టు ఎయిర్గా ప్రసారం చేయనున్నది. ఛానల్ 4 దానికి పార్ట్నర్గా వ్యవహరించనున్నది. యూకేలో 2005 నుంచి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల ప్రసార హక్కులు స్కై స్పోర్ట్స్ చేతిలోనే ఉన్నాయి. ప్రస్తుతం యూకేలో ప్రసార హక్కులను చానెల్ 4 దక్కించుకుంది. స్కై స్పోర్ట్స్తో వ్యవహారం కుదరకపోవడంతో ఆ సంస్థ ఒప్పందం చేసుకోలేదు. అయితే, ఇంగ్లండ్ ఫైనల్ చేరిన నేపథ్యంలో చానెల్ 4 దిగొచ్చింది.
క్రికెట్ పట్ల ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఫ్రీ టు ఎయిర్గా ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సబ్స్ర్కిప్షన్ ధరలు భారీగా ఉండడంతో చాలా మంది ఇంగ్లండ్ అభిమానులు ప్రపంచకప్ మ్యాచ్లను టీవీల్లో చూడడం లేదని ఇటీవల ఓ సర్వే తెలిపింది.
ప్రపంచకప్ టోర్నమెంట్లో ఇంగ్లండ్ జట్టు ఫైనల్కు చేరుకోవడం ఇది నాలుగోసారి. ఇప్పటిదాకా మూడుసార్లే ఆ జట్టు ఫైనల్కు వెళ్లగలిగింది గానీ కప్ను అందుకోలేకపోయింది. ఆదివారం మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతంది. 1979లో వెస్టిండీస్ చేతిలో, 1987లో ఆస్ట్రేలియా చేతిలో, 1992లో పాకిస్తాన్ చేతిలో పరాభవాన్ని చవిచూసింది. తాజాగా 27 సంవత్సరాల తరువాత తొలిసారిగా ప్రపంచకప్ ఫైనల్లో అడుగు పెట్టగలిగింది. ఈ సారి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.