ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో పాటు న్యూజిలాండ్ను కూడా విజేతగా ప్రకటించే అవకాశాన్ని పరిశీలించాల్సి ఉండేదని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్ అభిప్రాయపడ్డారు. లార్డ్స్ వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు అనూహ్య రీతిలో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది.
అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అనంతరం 16 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరు బంతుల్లో వికెట్ నష్టపోయి 15 పరుగులే చేసింది. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది. చివరకు బౌండరీలు ఆధారంగా ఇంగ్లాండ్ను విశ్వవిజేతగా ప్రకటించారు.
మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ మాట్లాడుతూ... 'ఏడు వారాల పాటు ప్రపంచకప్ ఆడిన జట్లను ఫైనల్ ఒక్కరోజుతో వేరు చేయడం సరికాదు. రెండు జట్లనూ విజేతగా ప్రకటించే అవకాశాన్ని పరిశీలించాల్సింది. మేము మంచి క్రికెట్ ఆడాం. చాలా బాధగా ఉంది' అని అన్నారు.
న్యూజిలాండ్ బ్యాటింగ్ కోచ్ క్రేగ్ మెక్మిల్లన్ మాట్లాడుతూ... 'ఇక ఫలితాన్ని ఇప్పుడు మార్చలేం. ఫైనల్స్, సూపర్ ఓవర్లో రెండు జట్లూ సమాన స్కోర్లు సాధించి తర్వాత ఒక్కరినే విజేతగా ప్రకటించడం సమర్థించలేము. రెండు జట్లను విజేతగా ప్రకటించడమే సరైన నిర్ణయం. ఫలితం పట్ల నిరాశ చెందినా.. అవి ఆటలోని నియమాలు' అని పేర్కొన్నారు.