
ప్రపంచకప్లో భారత్ చేతిలో పరాజయమే తమకు మలుపు. ఆ ఓటమి తర్వాత ఆటగాళ్లలో కసి పెరిగింది, అదే మా వరుస విజయాలకు కారణం అని ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ తెలిపారు. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఆసీస్ అంచనాలకు తగ్గట్టుగానే ఆడుతోంది. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్లు ఆడిన ఆసీస్.. 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. శనివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 243 పరుగులను సైతం కాపాడుకుని ప్రత్యర్థిని 157 ఆలౌట్ చేసి ఘన విజయం సాధించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 5 వికెట్లు తీసాడు. మ్యాచ్ అనంతరం స్టార్క్ మాట్లాడుతూ... 'భారత్తో మ్యాచ్ అనంతరం మేం మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తున్నాం. వ్యూహాలను పక్కాగా అమలు చేస్తున్నాం. భారత్పై మేం సరిగా ఆడలేదు. ఈ ప్రపంచకప్లో ఆ మ్యాచే మాకు మలుపు. ఓటమి మాకు ఒక గుణపాఠం. టీమిండియాపై చేసిన పొరపాట్లను త్వరగానే సరిచేసుకున్నాం. తర్వాత మేం బౌలింగ్, బ్యాటింగ్పై లోతుగా చర్చించుకున్నాం. అప్పటి నుంచి మెరుగయ్యాం. పుంజుకున్న తీరు నిజంగా ప్రశంసనీయం' అని స్టార్క్ పేర్కొన్నాడు.
న్యూజిలాండ్తో ముగిసిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 86 పరుగుల తేడాతో గెలిచింది. ఖవాజా (88), కేరీ (71) రాణించడంతో మొదట ఆస్ట్రేలియా 9 వికెట్లకు 243 పరుగులు చేసింది. ఛేదనలో స్టార్క్, బెరెండార్ఫ్ ధాటికి కివీస్ తడబడింది. కెప్టెన్ విలియమ్సన్ (40) ఒక్కడే పోరాడాడు. చివరకు 43.4 ఓవర్లలో 157 పరుగులకే కివీస్ ఆలౌట్ అయింది. 39 పరుగులకే చివరి 7 వికెట్లు చేజార్చుకుంది. ఈ మ్యాచ్కు ముందే సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకున్న ఆసీస్.. తాజా విజయంతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఆసీస్ తన చివరి మ్యాచ్ దక్షిణిఫ్రికాతో ఆడనుంది.